జానాపై డిగ్గీ రాజా అసంతృప్తి: పీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా?
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. ఉత్తమ్కుమార్ రెడ్డి ఇప్పటికి రెండుసార్లు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపించారని, పార్టీ అధినాయకత్వం ఆయన రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టిందని ఏఐసిసి వర్గాలు తెలిపాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన రోజే ఉత్తమ్ తన రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి ఉత్తమ్కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖను పంపించారని అంటున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఈ రాజీనామా లేఖను పెండింగ్లో పెట్టింది.
మరోవైపు నారాయణ్ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరాజయం పాలైంది. నారాయణ్ఖేడ్ ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఓటమిపాలు కావటంతో కలత చెందిన ఉత్తమ్కుమార్రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మరోసారి తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్కు పంపించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.నాగేందర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు క్యామా మల్లేష్లు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి రాజీనామాను ఏఐసీసీ ఆమోదించింది.
మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ రాజీనామాపై అధినాయకత్వం ఇప్పుడిప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చునని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత జానారెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగ్విజయ్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయన్ని పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో జానా రెడ్డి వ్యవహరించిన తీరుతో పార్టీకి నష్టం కలిగిందని జిల్లాకు చెందిన పలువురు దిగ్విజయ్కు ఫిర్యాదు చేశారు.
జీహెచ్ఎంసీ రూ.ఐదు భోజనం తిని, చాలా బాగుందని జానా ప్రశంసించారని, దాంతో నష్టం జరిగిందని వివరించారు. జానా రెడ్డిని ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పించాలని కోరారు. దీంతో జానారెడ్డి తీరుపై దిగ్విజయ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో జానా అలా వ్యవహరించడం వెనుక కారణమేమిటని పార్టీ నేతలను ఆరా తీసినట్లు సమాచారం.