గులాబీ వనంలోఅసంత్రుప్తి సెగలు..
సొంత పార్టీ నేతల అసంత్రుప్తి సెగలు టీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పైకి అందరూ ఐకమత్యంగా, సంత్రుప్తిగా కనిపిస్తున్నా, లోలోపల మాత్రం అసంత్రుప్తి జ్వాలలతో రగిలిపోతునట్టు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి క్యాబినెట్ కూర్పుపై అసంత్రుప్తి వ్యక్తం చేయగా, అదే అంశానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వత్తాసు పలికారు. పార్టీ మారిని ఎమ్మెల్యేలకు అంత ప్రధాన్యత ఇవ్వకుండా కేసీఆర్ పక్కన పెట్టడంపైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పార్టీ నుంచి వెళ్లిన ప్రజాపతినిధుల వ్యవహారం గులాబీ పార్టీలో నివురు గప్పిన నిప్పులా పరిణమించిందని చర్చ జరుగుతోంది. ఏ నాయకుడు ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడో తెలియని పరిణామాలు చోటు చేసుకున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసంత్రుప్తితో రగులుతున్న గులాబీ నేతలు.. బాస్ పట్టించుకోవాలని డిమాండ్..
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు అసమ్మతి సెగలు తగులుతున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతల తీరే ఇందుకు ప్రధాన కారణంగా మారబోతోంది. కొద్ది రోజుల క్రితం సిరిసిల్ల మునిసిపల్ ఛైర్మన్ పావని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కమిషన్లు తీసుకోమని మంత్రి కెటీఆరే చెప్పారని.. రెండు శాతం కమిషన్లు తీసుకోవటం పెద్ద తప్పేమీ కాదన్నట్లు వ్యాఖ్యానించారు. అప్పటికప్పుడు ఆమెను పార్టీ నుంచి తొలగించి.. మళ్లీ తర్వాత చేర్చుకున్నారు. తాజాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ కౌన్సిలర్ కుమార్తెతో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన కూడా పలుమార్లు కెటీఆర్ పేరును యధేచ్చగా వాడేశారు. ఈ పరిణామాలపై అటు కెటీఆర్ కానీ..ఇటు ప్రభుత్వపరంగా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేది. ఇప్పుడు బిజెపి తన విమర్శలకు పదును పెంచడంతో టీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

పైపై మెరుగలే... లోన అంతా డొల్లతనం అంటున్న అసంత్రుప్త నేతలు..
తాజాగా మరో ఎమ్మెల్యే రాజకీయాలకు గుడ్ బై చెప్పే పరిస్థితి నెలకొంది. రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని పేర్కొన్నారు. పార్టీలో ఎంతో మందిని ప్రోత్సహించానని, ఇపుడు వారే తనకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కలుగజేసుకుని సమస్య పరిష్కరించి సోమారపు సత్యనారాయణ వివాదం టీ కప్పులో తుఫానులా ముగిస్తారా?. లేక అలాగే కొనసాగిస్తారా చూడాలి.

అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరకముందే పెద్దలు మేల్కొనాలనే వాదన వినిపిస్తోంది.
రామగుండం మేయర్ లక్ష్మీనారాయణపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ తీర్మానం ఉపసంహరించుకునేలా చూడాలని పార్టీ పెద్దలు సోమారపును ఆదేశించారు.అయితే ఆయన మాటను కార్పొరేటర్లు విన్పించుకునే పరిస్థితి లేకపోవటంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న సోమారపు రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. అయితే వాస్తవ పరిస్థితిని ఎమ్మెల్యే చెప్పేందుకు ప్రయత్నించగా..అది వినటానికి కూడా అధిష్టానం పెద్దలు సిద్ధంగా లేకపోవటం ఈ పరిస్థితికి దారితీసిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సొంత పార్టీ కుంపటికి ఇతర పార్టీల పన్నుపోటు తోడైతే కష్టమే..
దీంతో పాటు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తాజాగా కెసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కెసీఆర్ ఢిల్లీలో బిజెపితో.. తెలంగాణలో మజ్లిస్ తో దోస్తీనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ముమ్మాటికి తమకు శత్రుపక్షమే అని తేల్చిచెప్పారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంటకరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో కవిత నిజామాబాద్ ఎంపీగా గెలిస్తే..తన పేరు మార్చుకోవటంతోపాటు...రాజకీయాలకు స్వస్తి పలుకుతానని సవాల్ విసిరారు. వంద సీట్లు తెచ్చుకోవటం తర్వాత.. ముందు నిజామాబాద్ ఎంపీ సీటు గెలవాలని వ్యాఖ్యానించారు. వాస్తవానికి నిజామాబాద్ లో ఎంపీ కవితకు ఇబ్బందికరంగానే ఉందని.. అందుకే డీఎస్ పై నేతల ఫిర్యాదు వంటి అంశాలు తెరపైకి వచ్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్, బిజెపి తో పాటుగా సొంత పార్టీ నేతల చర్యలతో రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ మరింత ఆత్మ రక్షణలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications