కోడలు, మనవళ్ల మృతి కేసు: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు కోర్టులో ఊరట, నిర్దోషులుగా
హైదరాబాద్: కోడలు, ముగ్గురు మనవళ్ల మృతి కేసులో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన కుటుంబసభ్యలపైనా నమోదైన కేసును వరంగల్ జిల్లా కోర్టు మంగళవారం కొట్టివేసింది. 2015, నవంబర్ 4న సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక, మనవళ్లు అభినవ్, ఆయాన్, శ్రీయాన్ అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవదహనమయ్యారు.
ఈ ఘటనపై అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సిరిసిల్ల రాజయ్య దంపతులతో పాటు సారిక భర్త, ఇతర కుటుంబసభ్యులను అరెస్ట్ వరంగల్ జైలుకు తరలించారు. అయితే వారిది హత్య కాదని.. గ్యాస్ లీక్ అవడం వల్లే ప్రమాదం జరిగిందని హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు అప్పట్లోనే నివేదిక సమర్పించారు.

కాగా, ఘటనా స్థలం నుంచి వస్తువులను సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఎంజీఎంలో పోస్టుమార్టం సమయంలో కూడా విస్రా టెస్టు కోసం శరీర భాగాల నుంచి నమూనాలను సేకరించారు నిపుణులు. వారు పంపిన శాంపిల్స్పై ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 20 రోజుల పాటు పరీక్షలు జరిపిన నిపుణులు చివరకు వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్, రెండో నిందితుడిగా మాజీ ఎంపీ రాజయ్య, మూడవ నిందితురాలిగా రాజయ్య భార్య మాధవిపై గతంలో కేసు నమోదైంది. ఈ క్రమంలో సిరిసిల్ల రాజయ్య, ఆయన కుటుంబమే అసలు దోషులని అందరూ అనుకున్నారు. కానీ, మంగళవారం వరంగల్ జిల్లా కోర్టు ఈ ముగ్గురిని నిర్దోషులుగా తేల్చి తీర్పును ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య కు భారీ ఊరట లభించినట్లయింది. కేసుకు సంబంధించి సరైన ఆధారాలు పోలీసులు సమర్పించకపోవడంతో రాజయ్య కుటుంబాన్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం కేసు కొట్టేసింది జిల్లా కోర్టు.












Click it and Unblock the Notifications