అందుకే టీఆర్ఎస్ దాడులు, సహనాన్ని పరీక్షించొద్దు: కేసీఆర్ సర్కారుకు డీకే అరుణ, సోయం హెచ్చరిక
మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంపై బీజేపీ నేతలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ నియంత పాలనకు వ్యతిరేకంగానే ప్రజా సంగ్రామ యాత్ర సాగుతోందన్నారు. గ్రామాల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
అందుకే టీఆర్ఎస్ దాడాలంటూ డీకే అరుణ ఫైర్
బండి సంజయ్ పాదయాత్రలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల వద్ద టీఆర్ఎస్ శ్రేణులు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు నిలువరించారు. ఇరుపార్టీల శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలో డీకే అరుణ.. టీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ దాడులు చేస్తోందన్నారు డీకే అరుణ. బీజేపీ నేతలపై దాడి జరుగుతున్నా.. పోలీసులు స్పందించడం లేదని మండిపడ్డారు. తమపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడులు చేస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ నేతలు మద్యం తాగించి ఉసిగొల్పుతున్నారు: డీకే అరుణ
పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నారని కేసీఆర్ సర్కారుపై డీకే అరుణ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ శ్రేణులను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ శ్రేణుల దాడిలో తమ ఐదు వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. పాదయాత్రలో పేదలు తమ కష్టాలు, బాధలను ఏకరువు పెడుతున్నారని డీకే అరుణ చెప్పారు. టీఆర్ఎస్ నేతలు తమ శ్రేణులకు మద్యం తాగించి తమపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.
సంయమనం పాటించాలని తమ కార్యకర్తలను కోరుతున్నట్లు చెప్పారు. తెలంగాణను దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం నియంత పాలన కొనసాగిస్తోందన్నారు.
ఖబడ్దార్ కేసీఆర్ అంటూ సోయం బాపూరావు వార్నింగ్
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంపై బీజేపీ ఎంసీ సోయం బాపూరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబడ్దార్... కేసీఆర్! తమ ఓపికను చేతగానితనంగా భావించొద్దని ఆయన హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడితే తట్టుకోలేవ్.. ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ గూండాల దాడి హేయమని ఆయన మండిపడ్డారు.
ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని సోయం బాపూరావు అన్నారు. ఈ యాత్రతో టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందని, అక్కసుతో ప్రజా సంగ్రామ యాత్రను ఎట్లయినా అడ్డుకోవాలని కొంతమంది చిల్లరగాళ్లకు మందు తాగించి పంపిస్తున్నారని సోయం విమర్శించారు. కొందరు చెంచాగాళ్లు, కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే నాయకులు అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సంగ్రామ యాత్ర ఆగదన్నారు.
మా ఓపికను చేతగానితనం అనుకోవద్దు: టీఆర్ఎస్పై సోయం బాపూరావు
ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని బండి సంజయ్ ముందే పసిగట్టి బయటపెట్టి.. రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేశారని సోయం బాపూరావు అన్నారు. బండి సంజయ్ కనుసైగ చేస్తే చాలు... బీజేపీ కార్యకర్తలు తిరగబడతారు. మా పార్టీ కార్యకర్తలు తిరగబడితే టీఆర్ఎస్ ఉంటదా? అని సోయం బాపూరావు అన్నారు.
కానీ, మా అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యం ఇది కాదని, ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా తెలంగాణ ఫ్రజలను చేస్తున్న మోసాలను బయటపెట్టడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారన్నారని సోయం బాపూరావు తెలిపారు. అందుకే తాము సంయమనంతో ఉన్నామని, తమ ఓపికను చేతగానితనంగా భావించొద్దని హెచ్చరిస్తున్నానన్నారు. టీఆర్ఎస్ చిల్లరగాళ్ల కారు కూతలు, చిల్లర చేష్టలతో బీజేపీని ఏమీ చేయలేరని గుర్తుంచుకోవాలని సోయం బాపూరావు తేల్చి చెప్పారు.