'అరుంధతి' ఫైట్: నేను బొమ్మాళీ అయితే కేసీఆర్ పశుపతా?, జూపళ్లిపై నిప్పులు
హైదరాబాద్: రాదనుకున్న తెలంగాణ సాధించామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వల్ల రాలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ ఆదివారం అన్నారు.
గద్వాల, జనగామ జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్యలు ఇందిరా పార్క్ వద్ద 48 గంటల నిరాహార దీక్ష చేశారు. ఆదివారం నాడు సాయంత్రం దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడారు. కేసీఆర్ ఉద్యమంతో తెలంగాణ రాలేదన్నారు. అరవై ఏళ్ల ప్రజల ఆకాంక్ష కారణంగా వచ్చిందన్నారు.
కాంట్రాక్టర్ల కోసమే కొత్త జిల్లాలు అని ఆరోపించారు. గద్వాల జిల్లా కోసం ఎలాంటి ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పారు. కనీస, మౌలిక వసతులు లేని వనపర్తికి గద్వాల ప్రజలు వెళ్లలేరన్నారు. జిల్లా గురించి కనీస అవగాహన లేదని జూపల్లి కృష్ణా రావు మంత్రిగా ఉండటం దురదృష్టకరమన్నారు.
నేను బొమ్మాళీ అయితే మీ నాన్ని కేసీఆర్ పశుపతియా అని ప్రశ్నించారు. తనను బొమ్మాళీ అన్న కవిత.. పశుపతి ఎవరో కూడా చెప్పాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగాలన్నారు.
కొత్త జిల్లాల కోసం గద్వాల, జనగామ, సిరిసిల్ల ప్రజల అబిప్రాయాలు తెలుసుకోవాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగాలన్న ఉద్యమాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో అయోమయస్థితి ఉందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా జరగాలన్నారు. గిరిజన జిల్లాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.