పీజీ సీటు రాలేదని యువతి ఆత్మహత్య, ఆకతాయి వేధింపుతో లేడీ టీచర్..
హైదరాబాద్: పీజీలో సీటు రాలేదనే వేదనతో ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి యశోద ఆసుపత్రిలో పని చేస్తున్న అదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన అనూష అల్వాల్లోని మంజీరా కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఆమె ఒంటరిగానే ఉంటున్నారు.
పలుమార్లు పీజీ(ఎండీ) అర్హత ప్రవేశ పరీక్ష రాసినా, సీటు రాలేదు. పది రోజుల క్రితం రాజీనామా చేసి, ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఓల్డ్ అల్వాల్లోని బీహెచ్ఈఎల్ కాలనీలో బంధువులకు ఫోన్ చేసి తనకు సీటు రావడం లేదని బాధపడింది. ఆమె మాటలతో అనుమానం వచ్చిన బంధువులు ఆమె గదికి వచ్చి చూసేసరికి ఆత్మహత్య చేసుకుంది.
ఒంటరితనం భరించలేక డాక్టర్ ఆత్మహత్య
ఒంటరితనం భరించలేక సర్జికల్ బ్లేడుతో కోసుకొని ఓ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురంకు చెందిన విజయ్ కుమార్ సూపర్ స్పెషాలిటి కోర్సు (డీఎం) నిమిత్తం హైదరాబాద్ వచ్చాడు. ఉస్మానియా ఆసుపత్రిలోని కిడ్నీ విభాగంలో గత అక్టోబర్ నెలలో చేరారు.
అతను రాంనగర్లోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. విజయ్ కుమార్కు పెళ్లయింది. కుటుంబ కలహాల కారణంగా రెండేళ్ల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. మరోవైపు, అతను ఎవరి ఇంట్లో ఉంటున్నారో.. ఆ మేనమామ కుటుంబ సభ్యులు అనంతపురం వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 16న.. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఒంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ బంధువు ఇంటికి రాగా తలుపులు తీయకపోవడంతో బద్దలు కొట్టి చూస్తే... చనిపోయి ఉన్నాడు.
ప్రేమ వేధింపు భరించలేక లేడీ టీచర్ ఆత్మహత్య
ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ లేడీ టీచర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం నాడు చోటు చేసుకుంది. హయత్నగర్ ఎల్లారెడ్డికాలనీకి చెందిన చందన డిగ్రీ చదవి, స్థానికంగా ఓ ప్రయివేటు పాఠశాలలో టీచర్గా పని చేస్తోంది.
శనివారం ఉదయం 9.30 గంటల సమయంలో తన తల్లిదండ్రులతో కలిసి ఆమె హయత్నగర్ పోలీస్ స్టేషన్ వచ్చింది. మూడు ఫోన్ నంబర్ల నుంచి ఎవరో తనకూ, తన కుటుంబసభ్యులకు తరచూ అసభ్య సందేశాలు పంపుతున్నారంటూ ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ నెంబర్ చౌటుప్పల్కు చెందిన మహేష్దని తేలింది. ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో మధ్యాహ్నం సమయంలో చందన సరూర్ నగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
మహేష్, అతని స్నేహితులు నిత్యం చందనకు అసభ్య సందేశాలు పంపించేవారని, ప్రేమించాలని వేధించేవారని, అందుకే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ చందనను మహేష్ వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె సోదరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.