డిగ్రీ విద్యార్థులకు శుభవార్త; ఇకపై ఆ డిగ్రీ చేస్తే బీటెక్ చేసినట్టే.. డిగ్రీలో కొత్తకోర్సు!!
బీటెక్, బి ఫార్మసీ, బిజినెస్ మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు ఎక్కువైన తర్వాత డిగ్రీ కోర్సుల పట్ల ఆదరణ తక్కువైంది. దీంతో డిగ్రీ కాలేజీలు నిర్వహించడం కష్టం గా మారిపోయింది. డిగ్రీ కోర్సుల్లో చేరే వారు లేక, చాలా డిగ్రీ కళాశాలలు మూత పడిన పరిస్థితి ఉంది.
రోజురోజుకీ దారుణంగా డిగ్రీ కోర్సుల పరిస్థితి మారుతుంటే, దీనికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పేరుతో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు. ఇది అంపశయ్య మీద ఉన్న డిగ్రీ విద్యా వ్యవస్థను మళ్ళీ బతికించే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ తోనే విద్యార్థులు బీటెక్ స్థాయి అర్హత సాధించడానికి అవకాశం కల్పిస్తున్నారు. మారుతున్న పోటీ ప్రపంచంలో ఇంజనీరింగ్ విద్యార్థులతో సమానంగా డిగ్రీ విద్యార్థులు కూడా అవకాశం పొందడానికి కంప్యూటర్ సైన్స్ పేరుతో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు.
ప్రస్తుతానికి 11 ప్రభుత్వ డిగ్రీ, అటానమస్ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులోకి తెస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఈ కోర్సులో అడ్మిషన్ లు ఎక్కువగా ఉంటే, దానిని బట్టి భవిష్యత్తులో మరిన్ని కళాశాలలలో ఈ కోర్సును అందించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కళాశాలలలో ఎక్కువ ఫీజులు చెల్లించి చదువుకోలేని విద్యార్థులు, డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకొని బి టెక్ తో సమానమైన ఉద్యోగాలను పొందే అవకాశం ఉండటంతో ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సైతం ప్రస్తుత ఉద్యోగ ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాకుండా, మరి ఇతర కోర్సులను కూడా డిగ్రీ విద్యలోకి తీసుకువచ్చి డిగ్రీ విద్యనూ, డిగ్రీ కళాశాలల మనుగడను ప్రశ్నార్ధకం కాకుండా కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications