మూడేళ్లు సహజీవనం చేసి చెక్కేసి మరో యువతితో రెడీ
ఓ యువకుడు ఓ అనాథ బాలికతో మూడేళ్ల పాటు సహజీవనం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు. తన బేకరీకి వస్తూ ఉన్న యువతితో అతను పరిచయం పెంచుకున్నాడు.
హైదరాబాద్: ఓ యువకుడు ఓ అనాథ బాలికతో మూడేళ్ల పాటు సహజీవనం చేసి ఆ తర్వాత వదిలేసి మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు. తన బేకరీకి వస్తూ ఉన్న యువతితో అతను పరిచయం పెంచుకున్నాడు. తాను జీవితాంతం వెంట ఉంటానని నమ్మబలికాడు. మూడేళ్ల పాటు ఆమెతో సహజీవనం చేశాడు.
బంధువుల అమ్మాయితో పెళ్లి నిశ్చయం కావడంతో ఈమెను వదిలేసి వెళ్లిపోయాడు. పాత నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి ఐదేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చింది. కృష్ణానగర్లోని స్నేహితురాలి గదిలో ఉంటూ వస్త్ర దుకాణంలో సేల్స్గర్ల్గా పని చేస్తోంది. ఆ దుకాణానికి ఎదురుగా రాజేష్ బేకరీ నడుపుతున్నాడు.

ఆ యువతి బేకరీకి తరుచుగా వెళ్తుండేది. దీంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. కృష్ణానగర్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఇద్దరూ సహజీవనం ప్రారంభించారు. అక్కడి నుంచి ఏడాది క్రితం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలోకి మకాం మార్చారు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
తనకు ఎవరూ లేకపోవడంతో అతని ఆగడాలను సహిస్తూ వచ్చింది. ఇటీవల రాజేష్కు తమ బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ఆ యువతి వద్దకు రావడం మానేశాడు. సెల్ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఐదు రోజుల క్రితం ప్రత్యక్షమైన రాజేష్ పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో అంగీకరించాడు. తర్వాత మళ్లీ కనిపించ లేదు.
రెండు రోజుల క్రితం రాజేష్ మేనమామ మోహన నాయక్ వారు ఉండే అద్దె ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న దుస్తులు, వంట సామగ్రి తీసుకొనిపోయాడు. యువతి తనకు న్యాయం చేయాలని అడిగితే మా వాడితో ఉన్నందుకు నువ్వే రూ.3 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications