తెలంగాణలో ముందస్తు: లెఫ్ట్ ఎవరికి వారే, జనసేనతో చర్చలు
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం వామపక్షాల మధ్య విభేదాలు తీసుకు వచ్చింది. సీపీఎం, సీపీఐ చెరో దారిలో పయనిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కలిస్తే వచ్చేది లేదని ఓ పార్టీ అంటే, ఆ పార్టీతో ముందుకెళ్దామని మరో పార్టీ చెబుతోంది.
దీంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే ఈ పార్టీలు వేర్వేరుగా పొత్తులు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వారిని కలుపుకొని వెళ్దామని సీపీఐ చెప్పింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఉంటే తాము కలవమని సీపీఎం స్పష్టం చేసింది. సీపీఎం బీఎలఎఫ్తో కూటమి కట్టనుంది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఓ వైపు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. మరోవైపు ఇవి కమ్యూనిస్టుల మధ్య విభేదాలు తీసుకువచ్చాయి. తమకు నచ్చిన పార్టీలతో ముందుకు వెళ్లేందుకు కమ్యూనిస్టులు తలోదారి చూసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సీపీఎంతో కలిసి పని చేసే అవకాశం లేదని సీపీఐ తెలిపింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని, టీఆర్ఎస్ వ్యతిరేక కూటమితో కలసి రావాలని సీపీఎంకు సీపీఐ సూచించింది. అయితే సీపీఐ ప్రకటనను సీపీఎం నేతలు కొట్టిపారేశారు.
కాంగ్రెస్కు తాము వ్యతిరేకమని, ఆ పార్టీ ఉన్న కూటమిలోకి తాము ఎలా వస్తామని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. బీఎల్ఎఫ్తో ఇప్పటికే కూటమిని ఏర్పాటు చేశామన్నారు. జనసేనతో కూడా పొత్తుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
బీఎల్ఎఫ్కు సీపీఐ దూరంగా ఉంటోంది. మరోవైపు కోదండరామ్ పార్టీతో కూడా కలసి వెళ్లనున్నట్టు సీపీఎం నేతలు చెప్పారు. వివిధ పార్టీలు ఇప్పటికే చర్చలలో మునిగిపోయాయి.