హైదరాబాద్, కరీంనగర్లలో ఈడీ సోదాలు: నగదు, కీలక డాక్యుమెంట్లు సీజ్, వివరాలు వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రానైట్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, తదితర ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఈడీ అధికారులు వెల్లడించారు.
ఈడీ ఎదుట హాజరైన గ్రానైట్ కంపెనీ యజమాని పాలకుర్తి శ్రీధర్ విచారణ ముగిసింది. మరోసారి విచారణకు రావాలని ఆయనకు అధికారులు తెలిపారు. నవంబర్ 18న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. ఈడీ దాడులు చేసిన అనంతరం అధికారులు పలు గ్రానైట్ కంపెనీల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో గ్రానైట్ కంపెనీల సోదాలపై ఈడీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. శ్వేత గ్రానైట్, శ్వేత ఏజెన్సీస్, ఎస్జీపీ ప్రైవేట్ లిమిటెడ్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీలలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. సోదాల్లో రూ. 1.08 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పదేళ్లలో ఎగుమతులకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
కరీంనగర్లోని 9 గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని పేరాల శేఖర్ రావు.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ శాఖకు ఏడాది క్రితం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించారు. మరోవైపు, ఇదే విషయంపై 2019లో బండి సంజయ్ కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ రెండు ఫిర్యాదులు ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి.
ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మంలోని గ్రానైట్ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సోమాజిగూడలోని పీఎస్ఆర్ గ్రానైట్స్ కార్యాలయం, హైదర్గూడ ఉప్పరపల్లిలోని ఎస్వీజీ గ్రానైట్స్ యజమాని ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈడీ దాడుల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications