ఎమ్మెల్సీ ఎన్నికకు డేట్ ఫిక్స్.. తుమ్మల ఖాళీ చేసిన స్థానానికి ఎలక్షన్
హైదరాబాద్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు ఎమ్మెల్యేగా గెలుపు పొందడంతో.. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తుమ్మల ఆ ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా, ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు తాజాగా ఎన్నికల కమిషన్ ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 26 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబర్ 3వ తేదీని నామినేషన్లకు డెడ్ లైన్ గా నిర్ణయించింది ఎన్నికల కమిషన్. అనంతరం అక్టోబర్ 17వ తేదీన ఎన్నిక నిర్వహించి అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొంది ఎన్నికల కమిషన్.
ఇకపోతే.. తుమ్మల ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానం కోసం పార్టీ తరుపున ఫరీదుద్దీన్ ను నిలబెడుతామని టీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో.. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నిక ద్వారా తుమ్మల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.