రాష్ట్రానికి భారీ పెట్టుబడులు: యువతకు వేల ఉద్యోగాలు!
అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం 'ఎలి లిల్లీ' తెలంగాణలో ఒక బిలియన్ డాలర్ల(రూ.9,000 కోట్ల) భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో కొత్త తయారీ ప్లాంట్, నాణ్యత నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది ఇటీవల కాలంలో తెలంగాణకు లభించిన అతిపెద్ద ఫార్మా పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది. సోమవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో ఎలి లిల్లీ గ్లోబల్ ప్రతినిధి బృందం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.
ఈ కొత్త తయారీ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇంజనీర్లు, రసాయన శాస్త్రవేత్తలు, విశ్లేషణ శాస్త్రవేత్తలు, క్వాలిటీ కంట్రోల్ నిపుణులు వంటి వివిధ హోదాల్లో నియామకాలు తక్షణమే ప్రారంభమవుతాయి. ఎలి లిల్లీ ఈ ప్లాంట్ను తెలంగాణలో ఏర్పాటు చేయడం ద్వారా, ఇక్కడ తయారు చేసిన ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఈ పెట్టుబడి ద్వారా ఎలి లిల్లీ కేవలం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) కార్యకలాపాలకే కాకుండా.. మధుమేహం, ఊబకాయం, అల్జీమర్స్, క్యాన్సర్, స్వయం ప్రతిరక్షక పరిస్థితులు (Autoimmune conditions) వంటి వాటికి సంబంధించిన కొత్త ఔషధాల తయారీపై దృష్టి సారిస్తుంది.

తెలంగాణపై ఎలి లిల్లీ నమ్మకం
తెలంగాణ నాయకత్వం, సమర్థవంతమైన పాలనపై ఉన్న నమ్మకమే ఈ పెట్టుబడికి కారణమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఆసక్తి ఉన్నప్పటికీ, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారం కారణంగా ఎలి లిల్లీ తెలంగాణను ఎంచుకుంది. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 4న హైదరాబాద్లోని ఎలి లిల్లీ జీసీసీని ప్రారంభించారు.
ఎలి లిల్లీ సంస్థను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ పెట్టుబడి లైఫ్ సైన్సెస్ కేంద్రంగా తెలంగాణ వృద్ధికి, గ్లోబల్ హెల్త్కేర్ హబ్గా హైదరాబాద్ ఆవిర్భవించడానికి సంకేతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎలి లిల్లీ ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలియజేసి, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలి లిల్లీ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. 1965లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హైదరాబాద్లో ఐడీపీఎల్ (IDPL) ను స్థాపించడం వల్లే హైదరాబాద్ బల్క్ డ్రగ్ తయారీ కేంద్రంగా ఎదిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. "ప్రపంచ స్థాయిలో కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి కూడా హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని ఆయన అన్నారు.తెలంగాణను నాలెడ్జ్ హబ్గా మార్చే ప్రభుత్వ ప్రణాళికలను వివరిస్తూ, కంపెనీలకు సాంకేతిక మద్దతు ఇచ్చేందుకు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్లో ఎలి లిల్లీ విస్తరణ తెలంగాణ డైనమిక్ పారిశ్రామిక వాతావరణానికి, అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ తయారీ రంగంలో పెరుగుతున్న ప్రభావానికి నిదర్శనమని అన్నారు.ఐసీసీసీలో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు,ఎలి లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్,లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications