సూపర్ లగ్జరీ బస్సుల్లో 20 శాతం ఛార్జీని తగ్గించిన TGSRTC: రూట్ ఇదే
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. పండగ సీజన్ లల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులను అందజేయడం వంటి పథకాలతో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెంచుకుంటోంది. అదే సమయంలో మరో ఆఫర్ను తెర మీదికి తీసుకొచ్చింది. ప్రయాణ ఛార్జీలో 20 శాతం డిస్కౌంట్ను ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే అన్ని రకాల టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య వివిధ రకాల బస్ సర్వీసులు అందుబాటులో ఉంటోన్నాయి. సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్, లహరి నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్- బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి.

జహీరాబాద్, వరంగల్, ఖమ్మం, మియాపూర్, పికెట్, నిజామాబాద్ వంటి డిపోల నుంచ మొత్తం 24కు పైగా సర్వీసులు ఈ రెండు నగరాల మధ్య నిత్యం ప్రయాణికులకు సేవలను అందిస్తోన్నాయి. వీటిల్లో ప్రస్తుతానికి అన్ని సూపర్ లగ్జరీ బస్సుల ఛార్జీలో 20 శాతం తగ్గింపును ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ. ఫలితంగా- ఒక్కో టికెట్ మీద 150 నుంచి 200 రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం ప్రయాణికులకు లభించినట్టయింది. https://www.tgsrtcbus.in వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని టీజీఎస్ఆర్టీ విజ్ఞప్తి చేసింది.
ఇదే సౌకర్యం హైదరాబాద్- తిరుపతి మధ్య నడిచే లహరీ బస్ సర్వీసుల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ రూట్ లో నడిచే లహరి ఏసీ బస్సుల్లో ఛార్జీపై 10 శాతం రాయితీని ఇస్తోంది. గతంలో ఇదే సౌకర్యం అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే బస్ సర్వీసుల్లో కల్పించిన విషయం తెలిసిందే. ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోండటం, ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో- దీన్ని ఇతర మార్గాలకూ విస్తరింపజేస్తోంది.












Click it and Unblock the Notifications