కెసిఆర్ మొండి వైఖరి: ఎర్రబెల్లి, చంపాలని కుట్ర చేశారు: నాయిని గ్రేటర్ సవాల్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొండి వైఖరి వల్లే రాష్ట్రంలో రైతులు నష్టపోయారని తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు మంగళవారం నాడు మండిపడ్డారు. తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితుల పైన టిఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని ఆరోపించారు.
కేంద్ర కరువు బృందం తెలంగాణలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సచివాలయంలో కేంద్ర కరువు బృందాన్ని తెలంగాణ టిడిపి నేతలు కలిశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. కెసిఆర్ మొండి వైఖరితో రైతులు నష్టపోయారన్నారు. పంటల బీమాను పెంచడంతో పాటు ఉపాధి హామీ రోజులను పెంచాలని తాము కేంద్ర బృందాన్ని కోరామని చెప్పారు.
నాయిని నర్సింహా రెడ్డి సవాల్
ప్రతిపక్ష నేతలకు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం నాడు సవాల్ విసిరారు. దమ్ముంటే గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దిగాలన్నారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో కేసీఆర్ను హత్య చేయడానికి సీమాంధ్ర గూండాలు కుట్రలు పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ మేయర్ పీఠాన్ని తమ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు. అరవై ఏళ్ల చరిత్రను కేవలం 18 నెలల పాలనలో మరిపించిన ఘనత కేసీఆర్దే అన్నారు. ఆయన అడిక్మెట్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్ మేయర్ పీఠం టీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తున్నారని చెప్పారు.