ఎర్రబెల్లి సంచలనం: ఓటుకు నోటులో బాబును రేవంత్ బెదిరిస్తున్నారా?
ఓటుకు నోటు కేసులో ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబును బెదిరిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ (టిడిపి) తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టిడిపి నాయకుడు ఎల్ రమణ తనను కలుసుకోవడంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన శనివారంనాడు తిప్పికొడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు.
ఓటుకు నోటు కేసులో అప్రూవర్గా మారుతానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బోగస్ ప్రచారం చేయడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని అన్నారు. అలాంటి వ్యూహాలతోనే ఎదుగుతానని రేవంత్ భ్రమిస్తున్నాడని కూడా అన్నారు.
తాను తిరిగి టిడిపిలో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. నిరాధారమైన వార్తను సృష్టించి రాజకీయంగా బద్నాం చేయడం సాధ్యం కాదని ఆయన శనివారంనాడు ఓ ప్రకటనలో అన్నారు. తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణతో కలిసి మాట్లాడిన విషయం నిజమేనని ఆయన అంగీకరించారు. తమ స్నేహం రాజకీయాలకు అతీతమైందని అన్నారు. తమ భేటీకి రాజకీయాలు ఆపాదించడం అర్థరహితమని అన్నారు. రేవంత్ రెడ్డిది మొదటి నుంచి కూడా సంకుచిత మనస్తత్వమని అన్నారు.
రాత్రిపూట ఎవరు ఎవరిళ్లకు వెళ్తారో, బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎవరు చేస్తారో అందరికీ తెలుసునని ఎర్రబెల్లి అన్నారు రేవంత్ రెడ్డి బిజెపి మొదలుకుని ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు.