ఎర్రబెల్లి-రమణ భేటీలో మతలబేంటి?: అంత సుదీర్ఘంగా ఏం చర్చించారు?
ఈ రెండు వాదనల్లో ఎంత నిజముందో తెలియదు గానీ.. రమణ ఇంటికి ఎర్రబెల్లి వెళ్లి మంతనాలు జరపడం మాత్రం ఇద్దరిలో ఎవరు పార్టీ మారబోతున్నారు? అన్న చర్చకు దారితీసింది.
హైదరాబాద్: ఒకరేమో పార్టీ మారి స్తబ్దుగా ఉన్న నేత.. మరొకరు ప్రభ కోల్పోయిన పార్టీకి అధ్యక్షుడు. వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందంటే.. ఎవరు ఎవరివైపు మొగ్గుచూపుతున్నారనే చర్చ సాధారణంగానే ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, టీటీడీపీ అధ్యక్షుడు రమణ మధ్య జరిగిన భేటీ కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది.
సొంతగూటిని వీడాక ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ఫోకస్ ను కోల్పోయారు. పార్టీలో ప్రాధాన్యం కోల్పోయారో.. లేక ఆయనే సైలెంట్ అయిపోయారో తెలియదు గానీ.. ఎప్పుడో తప్ప మీడియాలో ఆయన ప్రస్తావన కనిపించడం లేదు. ఇక రమణ విషయానికొస్తే.. ఓవైపు టీటీడీపీ అధ్యక్షుడిగా ఉంటూనే.. పార్టీ మారిన ఎర్రబెల్లితో సన్నిహితంగా మెలగడం ఆయన కదలికలపై అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.
రమణ టీఆర్ఎస్ గూటికి చేరే ఆలోచనలో ఉండబట్టే.. ఎర్రబెల్లి ఆయనతో సంప్రదింపులకు దిగారన్న వాదనలు వినిపిస్తున్నాయి. లేదు.. టీఆర్ఎస్ లో ఎర్రబెల్లికి అంతగా ప్రాధాన్యం దక్కట్లేదు కాబట్టి.. ఆయన తిరిగి సొంతగూటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.. అందుకే రమణను కలిశారు.. అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ రెండు వాదనల్లో ఎంత నిజముందో తెలియదు గానీ.. రమణ ఇంటికి ఎర్రబెల్లి వెళ్లి మంతనాలు జరపడం మాత్రం ఇద్దరిలో ఎవరు పార్టీ మారబోతున్నారు? అన్న చర్చకు దారితీసింది.
కాగా, బుధవారం నాడు రాత్రి 7గం. సమయంలో ఎర్రబెల్లి రమణ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది.
గురువారం నాడు వెలగపూడిలో అధినేత చంద్రబాబుతో సమావేశమైన టీడీపీ నేతలు ఎర్రబెల్లి-రమణ భేటీ గురించి కూడా ప్రస్తావించినట్టు సమాచారం.
వేర్వేరు పార్టీలో ఉన్నా.. తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన ఓ కేసు నిమిత్తం ఈ ఇద్దరు నేతలు ఒకే వాహనంలో ఆదిలాబాద్కు వెళ్లడం.. అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. రమణను టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు గతంలో టీఆర్ఎస్ ప్రయత్నాలు చేసిందన్న వాదనలు ఉన్న నేపథ్యంలో.. ఎర్రబెల్లి ఆయనతో భేటీ అవడం ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.
రమణ టీఆర్ఎస్ లోకి వస్తే.. కేబినెట్ హోదా కల్పించడంతో పాటు.. కీలక బాధ్యతలు అప్పజెప్పడానికి సీఎం కేసీఆర్ సిద్దంగా ఉన్నారని అప్పట్లో మంత్రి ఈటెల రాజేందర్ రమణకు హామి ఇచ్చారన్న వాదన కూడా ఉంది. వీటన్నింటి నడుమ ఇప్పుడు వీరిద్దరి మధ్య భేటీ జరగడం మాత్రం.. అసలు కారణం ఏమై ఉంటుందా? అన్న ప్రశ్న ఉదయించేలా చేసింది.












Click it and Unblock the Notifications