ఆస్ట్రేలియా గడ్డ వేదికగా.. పాకిస్థాన్కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!
భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల అధికారిక పర్యటలో భాగంగా ఇండోనేషియాలో పర్యటించిన అనంతరం ఇవాళ(గురువారం) ఆస్ట్రేలియా చేరుకున్నారు. జులై 8 నుంచి 10 వరకు సాగనున్న ఈ పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన భారీ ప్రవాస భారతీయుల సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 30 వేల మంది భారతీయులు హాజరైన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా ప్రధాని మోదీతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత రక్షణ వ్యూహాలను, సరిహద్దుల్లో ఉగ్రవాద నిర్మూలనకు చేపట్టిన చర్యలను ప్రస్తావిస్తూ పాకిస్థాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాద స్థావరాలపై పేలుళ్లు జరుగుతుంటే.. వాటి ప్రతిధ్వని మాత్రం ప్రపంచమంతటా వినిపించింది" అంటూ ప్రధాని మోదీ గర్జించారు. భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలను చూసే శక్తులకు దేశం ఇచ్చే సమాధానం ఎంత బలంగా ఉంటుందో ఈ కామెంట్ల ద్వారా ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో మెల్బోర్న్ ప్రజల ఉత్సాహాన్ని చూసి ముగ్దులైన ప్రధాని మోదీ.. ఈ కార్యక్రమం హౌస్ ఫుల్ అయిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో మిమ్మల్ని సిడ్నీలు రెండు సార్లు కలిశానన్న మోదీ.. ఈ సారి మెల్బోర్న్ ప్రజలతు కలిసి కాఫీ తాగాలని ఇక్కడికి విచ్చేశానని.. మెల్బోర్న్ నిజంగా ఈ రోజు అందరి హృదయాలను గెలుచుకుందని మోదీ వ్యాఖ్యానించారు. గత 12 ఏళ్లలో ఆస్ట్రేలియాలో ఇది తన మూడో పర్యటన అని ప్రధాని మోదీ గుర్తు చేస్తూ.. ఈ హ్యాట్రిక్ పర్యటనలు భారత్-ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయో చెప్పేందుకు నిదర్శనమన్నారు. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉన్న అహ్మదాబాద్ నుంచి ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఉన్న నగరం వరకు ఇరు దేశాల ప్రధానులు కలిసి ప్రయాణించడం విశేషమని కొనియాడారు.
పాలలో చక్కెర లాంటి వారు భారతీయులు
ఆస్ట్రేలియా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్రను ప్రధాని మోదీ ఎంతగానో అభినందించారు. భారతీయులు పాలలో కరిగిన చక్కెరలాంటివారని.. పాలు ఎక్కడివైనా అందులో కరిగి తీపిని పెంచడం లాగే భారతీయుల నైజం కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో ఇల్లు, పాలు స్థానికం కావచ్చు కానీ దానితో తయారయ్యే టీ మాత్రం పక్కా భారతీయమైనది. ఇక్కడి కూరగాయలకు భారతీయ సుగంధ ద్రవ్యాల తడ్కా తగిలితే వచ్చే రుచే వేరు అంటూ ప్రధాని మోదీ అభివర్ణించారు. ఆస్ట్రేలియాలో వారాంతాల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలు, గురుద్వారాలో అర్దాస్, పిల్లల భరతనాట్యం, భాంగ్రా నృత్యాలు లేదా క్రికెట్ టోర్నమెంట్లు.. ఇలా నిరంతరం భారతీయ సంస్కృతి ఉట్టిపడుతూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
భారతీయ సమాజంలో అద్భుతమైన శక్తి: అల్బనీస్
ప్రధాని మోదీ మాటలు వినేందుకు వచ్చిన సుమారు 30 వేల మంది ప్రజలను ఉద్దేశించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ.. దేశ ప్రగతికి దోహదపడిన భారతీయ సమాజానికి చేరువ కావడం సంతోషంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా అభివృద్ధిలో భారతీయుల కృషి మరువలేనిదన్నారు. ఈ సభలో కనిపిస్తున్న అద్భుతమైన ఎనర్జీనే భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యానికి అసలైన నిర్వచనమని ఆయన కొనియాడారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బుధవారం ఆస్ట్రేలియా చేరుకున్నారు. గురువారం ఆస్ట్రేలియా, భారత్ లు అనేక ముఖ్యమైన ఒప్పందాలను ప్రకటించాయి.ఇరు దేశాలు తమ వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ సంబంధాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాయి. రక్షణ సహకారంతో పాటు, యురేనియం సరఫరా కోసం ఆస్ట్రేలియాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.













Click it and Unblock the Notifications