ఇరాన్ దెబ్బకు విమానం మార్చేసిన ట్రంప్- ఏం జరిగిందంటే..?
అమెరికా-ఇరాన్ వార్ మళ్లీ మొదటికొచ్చేసింది. గతంలో కుదుర్చుకున్న తాత్కాలిక సంధి పక్కకుపోయింది. దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమైనీ అంత్యక్రియల వేళ ఆగ్రహంతో ఉన్న ఇరాన్.. హార్ముజ్ లో నౌకలపై దాడులకు దిగడం ద్వారా ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రయత్నించింది. ఇది అంతిమంగా అమెరికాను రెచ్చగొట్టినట్లయింది. దీంతో అమెరికా 80 లక్ష్యాలపై దాడులు చేస్తే.. ఇరాన్ 85 లక్ష్యాల మీద దాడులతో సమాధానం ఇచ్చింది. తాజాగా భారత్ నిర్మించిన చబహార్ పోర్టుపైనా అమెరికా దాడి చేసింది. ఈ ఉద్రిక్తల మధ్య ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా ట్రంప్ టర్కీలో జరిగిన నాటో సదస్సుకు హాజరై తిరిగి వెళ్తున్న సందర్భంగా ఈ మధ్యే ఖతార్ తనకు బహుమతిగా ఇచ్చిన అత్యాధునిక విమానాన్ని పక్కనబెట్టేశారు. దీనికి బదులుగా తన పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అమెరికాకు తిరిగి వచ్చారు. ఇరాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, చివరి నిమిషంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం.. ఖతార్ విమానం భద్రతా సామర్ధ్యాలపై ప్రశ్నల్ని లేవనెత్తింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా అమెరికా సైన్యం ఇరాన్ లోపల భారీ దాడులు చేసిన ఒక రోజు కూడా గడవక ముందే, అమెరికా-ఇరాన్ తాజా దాడులు చేసుకుంటున్న తరుణంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే విమానం మార్పుపై ట్రంప్ నేరుగా స్పందించలేదు. పాత జ్ఞాపకాల కోసమే తాను పాత ఎయిర్ ఫోర్స్ వన్లో ప్రయాణించినట్లు చెప్పుకొచ్చారు. తన కొత్త, పాత విమానాలు బ్రిటన్ లోని ఆర్ఏఎఫ్ మిల్డెన్హాల్లో అనుకోని విధంగా ఆగుతాయని ట్రంప్ వెల్లడించారు. సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్లో ట్రంప్.. సైనిక సిబ్బంది పరిశీలించేందుకు వీలుగా కొత్త విమానం ఆ స్థావరంలో ఆగుతుందని, అయితే దశాబ్దాలుగా ఎయిర్ ఫోర్స్ వన్గా సేవలందిస్తున్న విమానంలో తాను వాషింగ్టన్కు తిరిగి వెళ్తానని పేర్కొన్నారు. భద్రతాపరమైన ఆందోళనల కారణంగానే చివరి నిమిషంలో ఈ మార్పు జరిగిందా అని మీడియా ప్రశ్నిస్తే.. నేరుగా స్పందించకుండా.. ఇరాన్ చంపాల్సిన వారి జాబితాలో నేనే నంబర్ 1 అని చెప్పుకొచ్చారు.














Click it and Unblock the Notifications