రేవంత్తో గొడవ లేదు: బాబు క్లాస్ తర్వాత ఎర్రబెల్లి, చంద్రబాబు గ్రూపే: రావుల
విజయవాడ: కొడంగల్ యువ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి గొడవ లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు మంగళవారం నాడు చెప్పారు. బెజవాడలో చంద్రబాబు క్యాంప్ ఆఫీసులో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పార్టీ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్లో చేరడం లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆమెకు ఎంపీ పదవి ఇచ్చి సముచితంగా గౌరవించామని, పార్టీ మారదనే అనుకుంటున్నామన్నారు. కాగా, చంద్రబాబు పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు.
చంద్రబాబు గ్రూపే: రావుల
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు గ్రూపేనని టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం రావుల విలేకరులతో మాట్లాడారు. నవంబర్ నెల 7వ తేదీన హైదరాబాదులో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని, దీనికి చంద్రబాబు హాజరు అవుతారని చెప్పారు.
మాజీ మంత్రి విజయరామారావు సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పారు. పట్టు నిలుపుకోవడానికి వరంగల్లో పోటీ చేద్దామని చెప్పామన్నారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చిస్తానని చంద్రబాబు చెప్పారన్నారు. టీడీపీ, బీజేపీ పరస్పరం సహకరించుకోవాలని బాబు సూచించారని తెలిపారు.
టీ కప్పులో తుఫాన్: రమణ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు, గొడవలు టీ కప్పులో తుఫానే అని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ఇలాంటి చిన్న చిన్న విభేదాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. చిన్న పొరపాట్లు ఉంటే తాము సర్దుకు పోతామన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో తాము మిత్ర ధర్మంతో ముందుకు పోతామని, ఎన్డీయే అభ్యర్థిని నిలబెడతామని చెప్పారు.