ప్రతిపక్షాలకు ఊహించని షాక్ : అడుగుపెట్టొద్దని ఎర్రవల్లి ప్రజల వార్నింగ్
మెదక్ : జరుగుతోన్న పరిణామాలు చూస్తోంటే..! మల్లన్న సాగర్ వివాదంలో ఆందోళనలకు తెరపడి.. సమస్య పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదీగాక నిన్నటిదాకా నిర్వాసితుల తరుపున గొంతు చించుకున్న ప్రతిపక్షాలను ఇప్పుడదే ముంపు గ్రామాల ప్రజలు గ్రామంలోకి అడుగుపెట్టవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఇదో భారీ షాక్ కాగా.. ప్రభుత్వం మీద అక్కడి ప్రజలకున్న నమ్మకం దీనితో తేట తెల్లమైంది.
మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లి గ్రామస్తులు.. ప్రతిపక్షాల వైఖరిపై తాజాగా 'పలక రాతల'తో తమ నిరసన తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలు తమ గ్రామంలోకి అడుగుపెట్టి తమను ఆగం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. ప్రభుత్వం చెబుతోన్న జీవో-123 తమకు ఆమోదయోగ్యంగా ఉందని, మంత్రి హరీశ్ రావు మాటలపై పూర్తి భరోసా ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అక్కడి గ్రామస్తులు. అదే సమయంలో 2013జీవోకు ఒప్పుకోమని బలవంతం చేసి తమను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలను దుయ్యబడుతున్నారు.
తపాస్ పల్లి గ్రామానికి వెళ్లి చూసొచ్చామని..! అక్కడ ప్రతిపక్షాల సక్కదనమేందో స్పష్టంగా అర్థమవుతోందని ఇకనైనా తమ జోలికి రావద్దని విన్నవించుకుంటున్నారు ఎర్రవల్లి ప్రజలు. ప్రతిపక్షాల జోక్యం వల్లే ఎర్రవల్లిలో గొడవలు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న గ్రామస్తులు.. సోమవారం వేముల ఘాట్ నిర్వాసితులను పరామర్శించడానికి ఎర్రవల్లి గుండా వెళుతోన్న కాంగ్రెస్ నాయకులను ఘెరావ్ చేశారు. నాయకులు గ్రామంలోకి అడుగుపెట్టకుండా గ్రామ సరిహద్దులో పొలిమేర కంపను అడ్డంగా ఉంచారు.
కేసీఆర్ కు ఉన్న ప్రేమ ప్రతిపక్షాలకుంటదా?
ప్రతిపక్ష నేతలు ఒక్కరోజు బాగోతం గాళ్లని.. ఇయ్యాల ఉండి రేపు మాయమతరని ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్ కు ఉన్న ప్రేమ ఇయ్యాల ఉండి రేపు పోయే నేతలకుంటదా..? అని ప్రశ్నించారు హరీశ్. తాను మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నానని.. నిర్వాసితులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని అన్నారు హరీశ్.
ఈ సందర్బంగా ఎర్రవల్లి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన హరీశ్.. ప్రతిపక్షాలకు పరాభవం ఎదుర్కోక తప్పదన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ఇమాంబాద్, అనంతగిరి ప్రాజెక్టుల పరిధిలోని భూసేకరణ విషయంలోను ఇలాగే దుష్ట శక్తులు అడ్డు తగిలాయన్నారు హరీశ్. ఇమాంబాద్ రిజర్వాయర్ విషయంలో భూసేకరణ నిమిత్తం 120 రోజులు టెంటు వేస్తే.. ప్రతిపక్షాలు ఒకటే రెచ్చగొట్టుడు పని పెట్టుకున్నాయని విమర్శించారు.