పూర్తయిన గ్రౌండ్ వర్క్..?-ఆ ఆలోచన విరమించుకున్న ఈటల-కమలం గూటికే పయనం..?
తెలంగాణ రాజకీయ చర్చంతా ఇప్పుడు 'ఈటల' చుట్టూ ముసురుకుంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యాక ఈటల అడుగులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సొంత పార్టీ పెడుతారా... మరో పార్టీలో చేరుతారా అన్న ప్రశ్నలకు ఇప్పుడిప్పుడే కాస్త స్పష్టత వస్తోంది. ఇటీవలి ఆయన అడుగులు చూస్తుంటే బీజేపీకి ఆయన దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరట్లేదని మద్దతు కూడగట్టేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో భేటీ అయ్యానని ఈటల వెల్లడించారు. కానీ ప్రస్తుత పరిణామాలు మాత్రం ఈటల బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయమైందనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈటల అధికారికంగా దీనిపై ప్రకటన చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ఈటలతో కొండా,కోదండరాం భేటీ...
ఈటల బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం ఊపందుకున్న వేళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఈటల రాజేందర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఇద్దరు గురువారం(మే 26) ఉదయం శామీర్పేట్లోని ఈటల నివాసానికి చేరుకుని మంతనాలు జరుపుతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక ఇప్పటివరకూ రాజకీయ కార్యాచరణ ప్రకటించలేదు. గతంలో ఆయన పలుమార్లు బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. తాజా పరిస్థితుల్లో ఆయన కూడా ఈటల వెంటే బీజేపీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై ఈటలతో చర్చిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కోదండరాం ఈటలతో ఏం చర్చిస్తున్నారన్నది సస్పెన్స్గా మారింది. తమ పార్టీలోకి ఆహ్వానించేందుకే ఆయన ఈటలతో మంతనాలు జరుపుతున్నారా.. లేక ఈటల భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఏమైనా సలహాలు,సూచనలు ఇస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
'ఇండిపెండెంట్'ఆలోచన విరమించుకుని...
ఈటల నివాసానికి గురువారం ఉదయం హుజురాబాద్ నుంచి ఆయన కేడర్ అంతా తరలి వచ్చింది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నట్లు తమకైతే ఎలాంటి సమాచారం లేదని అనుచరులు చెబుతున్నారు. అదే సమయంలో ఈటల ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి సాగుతామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో భేటీ అయిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లే ఆలోచనను ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకుంటున్నానని... అందుకు బీజేపీ మద్దతు కావాలని కోరినట్లు సమాచారం. అయితే బీజేపీ అందుకు విముఖత వ్యక్తం చేయడంతో.. ఈటల మనసు మార్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతల సూచన మేరకు ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచన విరమించుకుని బీజేపీలో చేరి ఆ పార్టీ తరుపున పోటీ చేసే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పూర్తయిన గ్రౌండ్ వర్క్...?
ఈటల బీజేపీలో చేరికకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఒక తేదీ ఖరారు చేసి ఆయన బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తులా ఉమ కూడా బీజేపీలో చేరుతారని సమాచారం. అలాగే టీఆర్ఎస్లోని మరికొందరు అసంతృప్తి నేతలను కూడా తన వెంట తీసుకొస్తానని బీజేపీకి ఈటల హామీ ఇచ్చారన్న ప్రచారం కూడా సాగుతోంది. మరో ఒకటి,రెండు రోజుల్లో ఈటల కార్యాచరణకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.
గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నాకే...
బీజేపీ అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మొదట టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి,ఆపై శాసనసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే... టీఆర్ఎస్ కచ్చితంగా ఓడిస్తుందని బీజేపీ నేతలు ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈటలను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయొద్దని సలహా ఇచ్చానన్నారు. ఈ నేపథ్యంలో గ్రౌండ్ రియాలిటీని పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఈటల ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచన విరమించుకుని బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video