వరాలు అప్పుడే: కేసీఆర్పై నేరుగా ఈటల రాజేందర్ విమర్శలు, వాళ్లలా డబ్బును నమ్ముకోలేదంటూ..
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ తొలిసారి నేరుగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శలు సంధించారు. రాష్ట్రంలో ఉపఎన్నికలు ఎక్కడ వచ్చినా.. అక్కడ వరాల జల్లు కురిపించడం సీఎం కేసీఆర్కు అలవాటుగా మారిందన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.
కేసీఆర్ వరాలు అప్పుడే ఇస్తారు..: ఈటల రాజేందర్
అధికారం ఉన్నా లేకున్నా తాను ప్రజల కోసమే పనిచేశానని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. పింఛన్లు రాకపోవడంతో వితంతువులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పింఛన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు రూ. 3వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీవీ జిల్లా కోసం తాను గతంలోనే ప్రతిపాదన తీసుకొచ్చానని మాజీ మంత్రి తెలిపారు. ఎన్నికలు ఎక్కడ వస్తే అక్కడ వరాలు ఇచ్చే అలవాటు సీఎం కేసీఆర్కు ఉందని వ్యాఖ్యానించారు. తన రాజీనామా తర్వాత గతంలో ఆగిపోయిన పథకాలన్నీ వస్తాయని ప్రజలు సంతోష పడుతున్నారన్నారు. హుజూరాబాద్ను జిల్లాగా ప్రకటించడంతోపాటు వావిలాల, చల్లూరును మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాను పార్టీ మారలేదని, బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఈటల వ్యాఖ్యానించారు.
20ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానంటూ ఈటల
తాను 20ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్క రూపాయీ ఇవ్వలేదని, ప్రచారానికి ఎవరూ రాలేదని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీలు, జెడ్పీటీసీలను గెలిపించుకున్నానని తెలిపారు. తన నియోజకవర్గం నుంచి తమను విదీసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది నీచమైన చర్య అంటూ ధ్వజమెత్తారు.
మిడతల దండులా టీఆర్ఎస్ నేతలు.. గాలికి గెలవలేదు
మిడతలదండ దాడిచేసినట్లుగా టీఆర్ఎస్ వాళ్లు తనపై విమర్శల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. తాము గాలికి గెలిచిన వాళ్ళం కాదని.. 2004 నుంచి ఇప్పటి వరకు మెజార్టీతోనే గెలుస్తున్నానని ఈటల రాజేందర్ చెప్పారు. 2004లో గెలిచిన 10 స్థానాల్లో హుజూరాబాద్ కూడా ఒకటని గుర్తు చేశారు. తాను పార్టీ పెడుతున్నానంటూ విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని చూశారు కానీ.. ఆ బొంద నీ ప్రభుత్వమే పడుతుందని కేసీఆర్పై ధ్వజమెత్తారు.
తాను డబ్బులను నమ్ముకోలేదంటూ ఈటల చురకలు
ఎన్నికలు వచ్చాయంటే డబ్బులతో వస్తారని.. కానీ తమ ప్రజలు లొంగరని ఈటల వ్యాఖ్యానించారు. ఈటలను గెలిపించుకోవడం అంటే మనం మనం గెలిచినట్లుగా తమ ప్రజలు భావిస్తారని చెప్పారు. తెలంగాణలో గ్రామాలు బాగుంటే బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పా.. ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పిన అది తప్పా అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కొందరు చెంచాగాళ్లను తయారు చేసి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, వాళ్లలా తాను డబ్బుని నమ్ముకోలేదని మండిపడ్డారు. హరీశ్ రావుకి ఆత్మగౌరవం ఉందో.. తనకు ఉందో ప్రజలకు తెలుసని అన్నారు. 2018 ఎన్నికల్లోనూ తన ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేశారని అన్నారు. ఇప్పుడు జరగబోయే ధర్మయుద్ధంలో హుజూరాబాద్ ప్రజలు గెలుస్తారని అన్నారు.