కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది: ఈటల రాజేందర్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని సీఎం కేసీఆర్ కోల్పోయారని.. ఆయనకు భవిష్యత్తు లేదని అర్థమయ్యే ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు.
ధరణి వెబ్సైట్ రైతుల పట్ల శాపంగా మారిందని ఈటల రాజేందర్ అన్నారు. భూదాన్, ల్యాండ్ సీలింగ్ భూములపై కేసీఆర్ కన్ను పడిందని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను మోసం చేస్తూ భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. అలా సేకరించిన భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ స్థిరాస్తి వ్యాపారిగా మారిపోయారని ఈటల రాజేందర్ విమర్శించారు.
కేసీఆర్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని ఈటల ఆరోపించారు. గిరిజన కుటుంబాలు, గూడేల్లో అల్లకల్లోలం సృష్టించి వారి భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. గిరిజనుల భూముల్లో ట్రెంచ్లు కొడుతూ, వ్యవసాయ బావులు, బోరు బావులను పూడ్చివేస్తుంటే.. ఆ అంశాలపై ప్రతిపక్ష, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో లేవనెత్తినా ఫలితం లేదన్నారు. మహబూబాబాద్లో మెడికల్ కాలేజీల నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రజావసరాల కోసం వారి నుంచి భూములు తీసుకున్నప్పుడు అందుకు పరిహారం చెల్లించాలన్నారు ఈటల. కానీ, ప్రజలను వేధించడమే ఇక్కడ జరుగుతోందన్నారు. మెడికల్ కాలేజీ పేరిట 30 ఎకరాలు తీసుకుని.. భూనిర్వాసితులకు పరిహారం చెల్లించలేదన్నారు. బీజేపీ ఝూటా పార్టీ కాదని.. భారత ప్రజల పార్టీ అని అన్నారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రుణమాఫీ అమలు చేయకపోవడమే కాకుండా.. విద్యుత్, బస్ ఛార్జీలను పెంచిన టీఆర్ఎస్ పార్టీనే ఝూటా పార్టీ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.