కేసీఆర్ సర్కారు ఇంకెంతో కాలం ఉండదు: దౌర్జన్యాలకు దిగుతోందంటూ ఈటల రాజేందర్ ఫైర్
హైదరాబాద్/సిద్దిపేట: టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రైతులపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకెంతో కాలం ఉండదని అన్నారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఈటల రాజేందర్ పర్యటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు సంఘీభావం తెలిపారు. ఇల్లు లేని అందరికీ రెండు పడక ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల్లోని మేజర్లకు రూ. 8 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. సాగు భూముల అభివృద్ధికి రైతులకు డబ్బు చెల్లించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించాలన్నారు. లక్షలాది మందికి అవకాశం కల్పించే గూడటిపల్లి ప్రజలు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తే పోలీసులతో దౌర్జన్యం చేస్తూ రక్తపాతం సృష్టించడం దుర్మార్గ మైన చర్య అని మండిపడ్డారు. రైతులు ఏమైనా టెర్రరిస్టులా.. దీక్ష చేస్తూ ఉంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దారుణమన్నారు. పూర్తిస్థాయి పరిహారం అందించే వరకు రైతుల పక్షాన బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు.
కేసీఆర్ పాలన అంతం కావాలంటూ విజయశాంతి
అటల్ బిహారీ వాజ్ పేయి, అద్వానీ తమకు రాజకీయ గురువులని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి జయంతి ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. ఏ విషయంలో కాంప్రమైజ్ కాని గొప్ప నేతలు అటల్ బీహార్ వాజ్ పేయి, అద్వానీ. భారతీయ జనతా పార్టీలో నేతలకు డిసిప్లిన్ ఎంతో ప్రధానమైంది. అటల్ బిహారీ వాజ్ పేయి సిద్ధాంతాలను నమ్ముకొని నేటి ప్రధానమంత్రి మోడీ ముందుకు పోతున్నారని విజయశాంతి పేర్కొన్నారు. రాష్ట్రంలో 2024లో బీజేపీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ పాలన అంతం కావాలి' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.