అమానుషం: శవాన్ని వదలలేదు, దోచేశారు
సంగారెడ్డి: దొంగలు శవాన్ని కూడా వదలలేదు, దోచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూప్రాన్ బస్టాండ్కు బుధవారం సాయంత్రం అనారోగ్యంతో బాధపడుతూ ఓ వ్యక్తి వచ్చాడు. బస్సులు నిలిచే ప్రదేశం పక్కనే ఉన్న ఫుట్పాత్పై తన బ్యాగును తల కింద పెట్టుకొని పడుకున్నాడు.
అనారోగ్యంతో ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. రాత్రి 10 గంటల వరకు అక్కడే పడుకున్న ఆ వ్యక్తి అర్థరాత్రి ఎప్పుడో చనిపోయాడు. ఆయన బ్యాగులో ఏముందో తెలియదు గానీ ఫోన్తో పాటు చార్జర్ కూడా ఉన్నట్లు పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఆ ప్రాంతంలో సంచరించే కొందరు వ్యక్తులు శవాన్ని సైతం వదల్లేదు.
మృతుడి బ్యాగ్ను వెతికి మరీ దోచుకున్నారు. ఆచూకీకి ఆధారమైన మొబైల్ఫోన్ను కూడా తీసుకెళ్లారు. ఎందుకూ పనికిరాని బ్యాగ్లోని బట్టలు, మొబైల్ ఫోన్ చార్జర్ను వదిలేశారు. స్థానికుల సమాచారంతో తూప్రాన్ ఎస్ఐ సంతో్షకుమార్ శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గజ్వేల్ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు.
మృతుడి వద్ద ఉన్న ఓ ప్లాస్టిక్ కవర్లో లభించిన మందుల చీటీల ఆధారంగా మహారాష్ట్రలోని బీవండి జిల్లా షెలాపూర్ తాలుకా నడినాక గ్రామానికి చెందిన మహాకాల్ యాదవ్ (45)గా అనుమానిస్తున్నారు.