అనూష హత్య మిస్టరీ వీడింది: భవ్య కామవాంఛే ఈ ఘోరానికి కారణం
మహబూబాబాద్ జిల్లాలోని ఈదులపూసపల్లి శివారులోని మంచినీటి బావిలో గుర్తు తెలియని మృతదేహం, మహబూబాబాద్ పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీలో అపహరణకు గురైన అనూష మిస్టరీ వీడింది
మహబూబాబాద్: జిల్లాలోని ఈదులపూసపల్లి శివారులోని మంచినీటి బావిలో గుర్తు తెలియని మృతదేహం, మహబూబాబాద్ పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీలో అపహరణకు గురైన అనూష మిస్టరీ వీడింది అపహరణకు గురైన అనూషదే ఆ బావిలో లభించిన మృతదేహమని పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఓ వివాహిత.. అనూషను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈదులపూసపల్లి గ్రామశివారు దర్గాతండా సమీపంలోని మంచినీటి బావిలో మే 16న అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించిన గుర్తు తెలియని మృతదేహం, అపహరణకు గురైన అనూష(9)గా గుర్తించినట్లు తెలిపారు.
రాజీవ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పువ్వుల భవ్యకు 15 ఏళ్ల కిత్రం మేనమామ పూర్ణచందర్తో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. బైపాస్రోడ్డులో ఒక హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య వివాదాలున్నా కలిసే ఉంటున్నారు.
కాగా, హోటల్ సమీపంలోని ట్రాన్స్పోర్ట్ వాహనాల నిర్వాహకుడు విజయవాడకు చెందిన జంగిలి శ్రీనివాస్తో భవ్యకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. రెండు నెలల క్రితం నుంచి భవ్య, శ్రీనివాస్ విజయవాడకు వెళ్లి ఒక గదిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న భర్త పూర్ణచందర్ విజయవాడకు వచ్చి శ్రీనివాస్ తండ్రికి జరిగిన విషయం చెప్పడంతో ఆయన కుమారుడిని మందలించాడు.
అనంతరం పూర్ణచందర్ తన భార్య భవ్యను తీసుకొని మహబూబాబాద్కు వచ్చాడు. పోలికలు సరిపోయే అమ్మాయికి భవ్య దుస్తులు వేసి హత్య చేస్తే చనిపోయిందని భావించి ఎవరూ పట్టించుకోరని శ్రీనివాస్, భవ్య పథకం రూపొందించారు. ఈ క్రమంలో మహబూబాబాద్లోని అదే కాలనీలోని ఓర్సు రాములు కుమార్తె అనూషను హతమార్చాలని భవ్య భావించింది.
మే 13న భవ్య భర్త పూర్ణచందర్ పిల్లలను తీసుకొని విజయవాడకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన భవ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో అనూష వీధిలో కనిపించడంతో చాక్లెట్ కొనిచ్చి ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం అనూషను బెడ్రూంకి తీసుకెళ్లి తాను వేసుకునే దుస్తులు వేసి తలపై బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోగా నిప్పంటించింది.
పక్క గదిలో ఉన్న పెద్దమ్మ విజయలక్ష్మికి మెలకువ రావడంతో లేచింది. భవ్య జరిగిన విషయాన్ని విజయలక్ష్మికి చెప్పడంతో మృతదేహం ఇక్కడే ఉంటే ప్రమాదమని బావిలో వేయమని సలహా ఇచ్చింది. దీంతో ఆటోలో మృతదేహాన్ని తరలించి దర్గా సమీపంలో మంచినీటి బావిలో మృతదేహం మూటను వేసింది. కాగా, మే 16న బాలిక మృతదేహాన్ని బావిలో స్థానికులు గుర్తించారు.
ఆమె మృతదేహాన్ని బయటకు తీసి గుర్తు తెలియని యువతిగా పోలీసులు కేసునమోదు చేశారు. కాగా, బాలిక అపహరణ కేసు విషయంలో మే 15న పోలీసు బృందం విజయవాడకు వెళ్లి అక్కడ ఉన్న అనుమానితురాలిగా భావిస్తున్న భవ్యను అదుపులోకి తీసుకొని విచారించడంతో బావిలో గుర్తు తెలియని యువతిగా భావిస్తున్న మృతదేహం రాజీవ్నగర్ కాలనీకి చెందిన అనూషగా అంగీకరించిందని ఎస్పీ కోటిరెడ్డి వివరించారు. తన ప్రియుడి సలహా మేరకు ఇలా చేసినట్లు భవ్య తెలిపిందని చెప్పారు.
దీంతో అనూషను హత్య చేసిన భవ్య, సలహా ఇచ్చిన ప్రియుడు శ్రీనివాస్, సహకరించిన పెద్దమ్మ విజయలక్ష్మిలపై కేసునమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. మీడియా సమావేశంలో డీఎస్పీ రాజమహేంద్రనాయక్, సీఐలు జబ్బార్, లింగయ్య, ఎస్సైలు తిరుపతి, జితేందర్, కమలాకర్లు ఉన్నారు.
అనూష హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. ఇంత కాలం అపరహరణకు గురైందనుకున్న తమ కూతురు ఇక లేదని తెలియడంతో అనూష కుటుంబంలో తీరని విషాదం మిగిలింది.