వివస్త్రను చేశాడంటూ బావపై మరదలి ఫిర్యాదు, బావ ఏం చేశాడంటే...
సొంత తమ్ముడు, మరదలే ఫిర్యాదు చేయడంతో అవమానంగా భావించిన ఓ వ్యక్తి తన పరువు పోయిందనే తీవ్ర మనస్థాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
కరీంనగర్: అకారణంగా తనపై ఫిర్యాదు చేసి పరువు తీశారని తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఏడెల్లి భూమిరెడ్డి(32), శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. వీరి మధ్య కొంత కాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం భూమి సాగు చేయడానికి పొలానికి వెళ్లిన భూమిరెడ్డిని అతని తమ్ముడు శ్రీనివాస్రెడ్డి, ఆయన భార్య సునీత కలిసి అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి భార్య సునీత తనను వివస్త్రను చేసి దాడి చేశారంటూ.. హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది. విషయం ఊరంతా తెలియడంతో అవమానంతో కుంగిపోయాడు భూమిరెడ్డి.
తీవ్ర మనస్థాపంతో శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని జమ్మికుంటలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భూమిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.