టీవీ గొడవ ఎంత పనిచేసిందంటే?: నిండు ప్రాణం బలి..
ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన జైతుల్.. దుడ్డుకర్ర లాంటి వస్తువుతో అతని మీద దాడి చేశాడు.
హైదరాబాద్: టీవీ సెట్ కోసం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన ఫరూక్ నగర్ లో చోటు చేసుకుంది. తన వద్ద నుంచి తీసుకున్న టీవీని, మరికొన్ని వస్తువులను తిరిగి ఇచ్చేయలేదన్న కారణంతో నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. జుబేర్(45) ఫలక్నమా పరిధిలోని ఫరూక్నగర్ లో ఓ ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ.. స్థానిక హోటల్ లో పనిచేస్తున్నాడు. మంగళవారం నాడు జుబేర్ హోటల్ లో పనిచేస్తున్న సమయంలో జైతుల్ అక్కడికి వచ్చాడు.
తన వద్దనుంచి తీసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేయలేదని నానా రభస చేశాడు. హోటల్ వద్ద జుబేర్ తో గొడవపడ్డ జైతుల్.. ఆరోజు రాత్రి అతని ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా ఇదే విషయమై మళ్లీ గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో.. తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన జైతుల్.. దుడ్డుకర్ర లాంటి వస్తువుతో అత్యంత దారుణంగా అతని మీద దాడి చేశాడు.
దీంతో జుబేర్ కుప్పకూలిపోయాడు. పోలీసులు సమాచారం అందుకుని ఘటనాస్థలికి వెళ్లేసరికి జుబేర్ రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. అనంతరం షహీన్ నగర్ లో ఉంటున్న అతని కుటుంబాన్ని విచారించారు.
ఆ తర్వాత జుబేర్ పనిచేసిన హోటల్ వద్దకు వెళ్లి ప్రశ్నించగా.. జైతుల్ గొడవపడ్డ విషయం గురించి చెప్పారు. దీంతో పోలీసులు జైతుల్ ని తమదైన శైలిలో ప్రశ్నించగా.. తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. నేరాంగీకారంతో జైతుల్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.