మాజీ మంత్రి కన్నుమూత- సంతాపం తెలిపిన సీఎం: అధికార లాంఛనాలతో..
తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కే విజయరామారావు కన్నుమూశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారిక అయిన ఆయన గతంలో సీబీఐ డైరెక్టర్ గా పని చేశారు.
హైదరాబాద్: తెలంగాణ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కే విజయరామారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయిన విజయరామారావు సీబీఐ డైరెక్టర్ గా పని చేశారు. తన హయాంలో అనేక కీలక కేసులపై దర్యాప్తును పర్యవేక్షించారు. పదవీ విరమణ చేసిన తరువాత ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. చంద్రబాబు సారథ్యంలోని మంత్రివర్గంలో బెర్త్ సాధించారు. వాణిజ్య శాఖ మంత్రిగా పని చేశారు.
2004, 2009లో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి దానం నాగేందర్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారంలో విజయరామారావు జన్మించారు. 1959లో ట్రైనీ ఐపీఎస్ గా జాయిన్ అయ్యారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. క్రమంగా అత్యున్నత పదవులను అందుకున్నారు. సీబీఐ డైరెక్టర్ వంటి కీలక హోదాల్లో పని చేశారు.

కే విజయరామారావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని పేర్కొన్నారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీలో, అనంతరం తెలంగాణలో విజయరామారావుతో తనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. కే విజయరామారావు భౌతిక కాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications