ఆ నలుగురే సూత్రధారులు... 400 గ్రా. గంజాయి,120 ఫుల్ బాటిల్స్.... రేవ్ పార్టీ ఘటనలో విస్తుపోయే విషయాలు...
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గాంధీనగర్ తండాలోని ఓ ఫామ్ హౌస్లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు నిర్దారించారు. వీరికి మరో ముగ్గురు సహకరించినట్లు గుర్తించారు. సోషల్ మీడియాలో 'పీఎస్ వై దమ్రూ' అనే పేజీని క్రియేట్ చేసి యువతను ఆకర్షించినట్లు తేల్చారు.
ఆ నలుగురు...
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.... ఎల్బీనగర్కు చెందిన విద్యార్థి శ్రీకర్ రెడ్డి,ఈసీఐఎల్కు చెందిన పేపర్ ప్రొడక్ట్ వ్యాపారి గిరీశ్ దడువాయ్,వనస్థలిపురానికి చెందిన జ్యువెల్లరీ వ్యాపారి చొల్లేటి శ్రీకాంత్, షేక్ ఉమర్ ఫారూఖ్ కలిసి ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. శ్రీకర్ రెడ్డి తండ్రి ధన్వంత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో ఈ పార్టీని ప్లాన్ చేశారు. పార్టీలో డ్రగ్స్ వినియోగం కోసం సూర్యాపేట జిల్లా బాలాజీనగర్కు చెందిన బాలెంల ప్రవీణ్ అనే వ్యక్తిని సంప్రదించారు. నిషేధిత మత్తు పదార్థాలను అతను సమకూర్చాడు.
సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించి...
సోషల్ మీడియాలో 'పీఎస్ వై దమ్రూ' అనే పేజీని క్రియేట్ చేసి 'మహదేవ్ గ్యాదరింగ్ ఎట్ రాచకొండ హిల్స్' అనే ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేశారు. శివరాత్రి రోజు నిర్వహించిన పార్టీ కావడంతో మహదేవ్ అనే పేరును చేర్చారు. సోషల్ మీడియా ద్వారానే 90 మంది యువతను ఆకర్షించి ఒక్కొక్కరి నుంచి రూ.499 చొప్పున ఎంట్రీ ఫీజుగా వసూలు చేశారు.అనుకున్నట్లుగానే గురువారం(మార్చి 11) గాంధీనగర్ తండాలోని ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ చేశారు. అయితే దీనిపై పక్కా సమాచారం అందడంతో ఎస్ఓటీ, భువనగిరి పోలీసు బృందాలు ఫామ్ హౌస్పై దాడులు నిర్వహించాయి.
భారీగా డ్రగ్స్....
రేవ్ పార్టీలో పాల్గొన్న 97 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 88 మంది యువకులు, ఇద్దరు యువతులు, ఏడుగురు నిర్వాహకులు ఉన్నారు. వీరి నుంచి 400 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎల్ఎస్డీ డ్రగ్, 2 గ్రాముల గుర్తు తెలియని డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 120 ఆల్కహాల్ బాటిల్స్, మూడు ల్యాప్టాప్లు, 2 కెమెరాలు, 76 సెల్ఫోన్లు, 15 కార్లు, 30 బైక్లు, 21 ఎంట్రీ టికెట్లు, సిగరెట్ ప్యాకెట్లు, గంజాయిలో వినియోగించే ఓసీఏం పేపర్లు,రూ.27,030 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువతీ యువకులపై కేసు నమోదు చేశారు.నిర్వాహకులను రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు.
ఒకరికి కరోనా పాజిటివ్...
రేవ్ పార్టీ ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మూడు నెలల క్రితం వరంగల్ జిల్లా లక్నవరం సరస్సు వద్ద కూడా ఇలాంటి పార్టీ జరిగిందన్నారు. నిర్వాహకులకు డ్రగ్స్, గంజాయి ఎక్కడినుంచి వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్నవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. అందులో ఒకరికి పాజిటివ్గా నిర్దారణ అయిందన్నారు.