రైతులకు ఉచిత ఎరువులు, ఖాతాలో రూ.4వేలు: కేసీఆర్ సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర రైతులకు భారీ వరాలిచ్చారు. వచ్చే ఏడాది నుంచి 26లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్ర రైతులకు భారీ వరాలిచ్చారు. వచ్చే ఏడాది నుంచి 26లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు. ప్రతి ఎకరానికి 5 ఎరువుల బస్తాలను ఉచితంగా అందిస్తామని కేసీఆర్ చెప్పారు.
రూ. 17వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన సందర్భంగా సీఎం అధికారిక భవనం ప్రగతి భవన్కు భారీ ఎత్తున రైతులు వచ్చి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. దేశంలోనే 17వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం తమదేనని అన్నారు.
అంతేగాక, ప్రతీ సంవత్సరం మే నెల30వ తేదీలోపు ప్రతీ రైతు బ్యాంకు ఖాతాలో ఎకరానికి రూ. 4వేలను ప్రభుత్వం వేస్తుందని సీఎం చెప్పారు. సమైక్య పాలనలో నిజామాబాద్ నాశనమైందని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం హయాంలో ఒక్క క్షణం కూడా కరెంటు కోత లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు.
కోటి ఎకరాలకు గోదావరి నీళ్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. బంగారు తెలంగాణ కోసం నీమ్స్ ఆస్పత్రిలో చావుతో పోరాడానని చెప్పారు. రైతులందరూ ఒకే రకం పంటలు వేస్తే నష్టాలు తప్పవని అన్నారు. అందరికీ యూనియన్లు ఉన్నాయి కానీ, రైతుల కోసం పోరాడేవారు లేరని అన్నారు.
తెలంగాణ రైతులు పండగ చేసుకునేలా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతీ గ్రామంలో గ్రామ రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రికి సూచించారు. రైతు, ఆయనకున్న భూమి, పంట వివరాలను సేకరించాలని అన్నారు. ప్రతీ మే నెలలో వారి బ్యాంకు ఖాతాలో ఎకరానికి రూ.4వేల చొప్పున నగదు ప్రభుత్వం నుంచి పడుతుందని అన్నారు.
వ్యవసాయం మంత్రి ఒత్తిడి చేశారని, దీంతో నాబార్డ్ నుంచి రూ.1000కోట్ల రుణం తెచ్చామని అన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్లు చేపట్టామని తెలిపారు. ఆధునిక పద్ధతుల్లో రైతులు వ్యవసాయాన్ని చేయాలని అన్నారు. యంత్రాలను విస్తృతంగా ఉండాలన్నారు. బంగారు పంటలు పండించి బంగారు తెలంగాణ చేయాలని అన్నారు. కేసీఆర్ పరువు కాపాడాలని అన్నారు. రైతులందరికీ ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు.