ZPTC to TPCC: దూకుడే ఆయుధంగా..రేవంత్ అసలు లక్ష్యం అదే : ఫైర్ బ్రాండ్ రూటే సపరేటు..!!
రేవంత్ రెడ్డి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నా..తెలంగాణలో కొత్తగా పీసీసీ చీఫ్ గా ప్రకటించిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. అతి తక్కవ కాలంలో ఒ చిన్న గ్రామంలో ఎగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి..ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఉద్దండులు ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వాన్నే మెప్పించిన నేత. గ్రామ స్థాయి నుండే రాజధాని వరకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో.. ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన నేత. దుబ్బాక..గ్రేటర్ ఎన్నికల తరువాత తెలంగాణ లో కేసీఆర్ వర్సెస్ బీజేపీ. కానీ, ఇప్పుడు కేసీఆర్ వర్సస్ కాంగ్రెస్. కాదు కేసీఆర్ వర్సెస్ రేవంత్.
Recommended Video
గ్రామం నుండి హస్తిన దాకా..
ఇక్కసారిగా టీపీసీసీ నియామకంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పు. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి విద్యార్ధి దశలోనే ఏబీవీపీలో చురుకుగా పని చేసారు. చిన్నప్పటి నుండి అందరితో కలిసి పోయే మనస్తత్వం..దూకుడు స్వభావం అయనకు కలిసి వచ్చింది. ఇక, యువకుడిగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నుండి తొలుత జెడ్పీటీసీ సీటు ఆశించి భంగ పడ్డారు. స్వతంత్ర అభ్యర్ధిగానే పోటీ చేసి మిడ్గిల్ జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తరువాత 2008 లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ సమయంలో గ్రామ స్థాయి నుండి క్రమేణా మహబూబ్ నగర్ జిల్లా నేతగా ఎదిగారు. అనేక మంది అనుచర గణాన్ని సంపాదించుకున్నారు.
కేసీఆర్ కు టార్గెట్ గా..
తరువాతి కాలంలో టీడీపీలో చేరారు. 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రభుత్వం పైనా..తెలంగాణ సమయంలో టీడీపీ నుండి బలమైన వాయిస్ గా మారారు. ఇక, చంద్రబాబు అంటే రేవంత్ కు అభిమానం. టీడీపీ తెలంగాణలో సీనియర్లుగా ఉన్న ఎర్రబల్లి తో సహా మరి కొందరి తీరుతో రేవంత్ విభేదించారు. తెలంగాణ టీడీపీ భవిష్యత్ అర్దమైపోయింది. నేరుగా అమరావతి వెళ్లి చంద్రబాబుకు తన రాజీనామా లేఖ ఇచ్చారు. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. అప్పటికే ఓటు కు నోటు కేసులో రేవంత్ చిక్కులు ఎదుర్కొం టున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అదే అస్త్రంగా మారింది.
జెడ్పీటీసీ టు టీపీసీసీ
2019 ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవటానికి వీలు లేదని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారు. హరీష్ కు బాధ్యతలు అప్పగించారు. రేవంత్ ఓడిపోయారు. కానీ, అనూహ్యంగా కాంగ్రెస్ అధినాయకత్వం...రేవంత్ పైన నమ్మకంతో ఆయనకు సంబంధం లేని మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుండి బరిలోకి దింపింది. అంతే అనూహ్యం గా రేవంత్ గెలుపొందారు. అంతే, ఇక రేవంత్ లక్ష్యం డిసైడ్ అయిపోయింది. సీఎం కేసీఆర్ లక్ష్యంగా పని చేస్తూ..ఢిల్లీ స్థాయిలో పార్టీ అధినాయకత్వాన్ని ఆకర్షించారు. ఎలాగైనా టీపీసీసీ చీఫ్ కావాలని భావించారు. వ్యూహాత్మకంగా పావులు కదిపారు. గ్రూపులు..వర్గాలు...ఫిర్యాదులు..ప్రశంసలు అన్నింటినీ లెక్కలు వేసుకుంటూ..టెన్ జన్ పథ్ ను ఎట్రాక్ట్ చేసేలా ఢిల్లీలో పావులు కదిపారు.
పక్కా వ్యూహాత్మకంగా అడుగులు..
ఎంత మంది సీనియర్లు పోటీ చేసినా..సైలెంట్ ఆపరేషన్ లో సక్సెస్ అయ్యారు. ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ అయ్యారు. తన అసలు లక్ష్యం ముఖ్యమంత్రి పదవి. ఇందు కోసం పీసీపీ పదవి రాగానే పార్టీ సీనియర్లను కలిసారు. అందరి సహకారం కోరారు. పార్టీ లో అందరితో కలిసే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసారు. విభేదిస్తున్న నేతలు సహకారం అందించక తప్పని పరిస్థితి కల్పించారు. ఇక, ఈ రోజు టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు.
అవే బలం..బలహీనత అసలు లక్ష్యం అదే..
దూకుడు..పంచ్ లు..ఆకట్టుకొనే ప్రసంగాలు...అంశాల పైన స్పష్టత..విషయాల పైన అవగాహన రేవంత్ కు అదనపు బలం. ఇక, కేసీఆర్ వ్యతిరేకులకు ఇప్పుడు రేవంత్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. దీంతో..అసలు ఆట ఇప్పుడు మొదలైందంటూ రేవంత్ చెప్పటం వెనుక...తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రూటు సపరేట్ అనేది స్పష్టమవుతోంది. దీంతో..రేవంత్ వేసే ప్రతీ అడుగు కీలకంగా మారుతోంది. తన దూకుడే రేవంత్ కు బలం ..బలహీనత. మరి..ఇప్పుడు టీపీసీసీ అయిన రేవంత్ తన అసలు లక్ష్య చేధనలో ఏ రకంగా ముందకెళ్తారో...కేసీఆర్ ను ఎదుర్కొంటారో చూడాలి.