హైదరాబాద్కు కిషన్ రెడ్డి- నెక్స్ట్ టాస్క్ ఇదే
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ కార్యవర్గాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణల్లో పార్టీలో సంస్థాగత మార్పులను చేపట్టింది బీజేపీ అధిష్ఠానం. రెండు చోట్లా పార్టీ అధ్యక్షులను తొలగించింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి- ఏపీలో పార్టీ పగ్గాలను కేంద్ర మాజీమంత్రి డీ పురంధేశ్వరికి అప్పగించింది.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోండటం, ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక పోరును దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధిష్ఠానం- సంస్థాగత మార్పులను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ పార్టీ రాష్ట్ర శాఖ కార్యవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయబోతోంది. కొత్త ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు రాబోతోన్నారు.

ఈ నియామకాలు చోటు చేసుకున్న తరువాత- కిషన్ రెడ్డి పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తనకు తెలంగాణ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు చెబుతున్నారు. ఇవ్వాళ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికీ డుమ్మా కొట్టారు.
బీజేపీ పెద్దలెవరికీ ఆయన అందుబాటులో లేకుండా పోయారు. ఆయన మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్లో ఉన్నట్లు జాతీయ మీడియా చెబుతోంది. మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయనగా.. తనకు పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలను అప్పగించడం సబబు కాదనే అభిప్రాయంలో కిషన్ రెడ్డి ఉన్నారని అంటోన్నారు.
దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. ఈ వార్తలను తోసిపుచ్చారు. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం చూపిన బాటలో సాగుతానని అన్నారు. కేంద్ర మంత్రిగా తన స్థానానికి సంబంధించినంత వరకు, పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసావహిస్తానని తేల్చి చెప్పారు.
ఈ పరిణామాల మధ్య కిషన్ రెడ్డి హైదరాబాద్కు వచ్చారు. ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఆయన రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విమానాశ్రయంలో ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనను విజయవంతం చేయడంపై కిషన్ రెడ్డి దృష్టి సారించారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా నియమితులైన తరువాత ఆయన ఫస్ట్ టాస్క్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా తన సత్తా చాటాలని భావిస్తోన్నారాయన.












Click it and Unblock the Notifications