గల్లీ టూ ఢిల్లీ.. గంటా బజాయించి ఐక్యతను చాటిన భారతీయులు
జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5గంటలకు ప్రజలంతా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఇంతటి సంక్షోభ కాలంలో ప్రజల కోసం నిరంతర సేవలు అందిస్తున్న వైద్యులు,నర్సులు,పారిశుద్ధ్య కార్మికులు ఇతరత్రా అత్యవసర సేవల సిబ్బందికి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశారు. యావత్ భారత్ దేశం చప్పట్లతో పులకించపోయింది. కుల,మత,ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా తమ ఇళ్ల ముందు,బాల్కనీల్లో నిలబడి చప్పట్ల ద్వారా హర్షం ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంవో అధికారులు పలువురు మంత్రులు,కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని ప్రగతి భవన్లో చప్పట్లు కొట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి తాడేపల్లిలోని తన నివాసంలో చప్పట్లు కొట్టారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గంటా బజాయించి హర్షం ప్రకటించారు. సామాన్యులు, సినీ తారలు,రాజకీయ ప్రముఖులు ఎక్కడికక్కడ తమ ఇళ్ల నుంచే చప్పట్లు కొట్టి దేశ ఐక్యతను చాటారు. దీంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా గ్రామాలు,,పట్టణాలు,నగరాలు,ఐదు నిమిషాల పాటు చప్పట్లతో మారుమోగాయి.
కొంతమంది చప్పట్లతో హర్షం ప్రకటించగా.. మరికొంతమంది గంటా బజాయించారు. మరికొందరు స్టీల్ ప్లేట్లపై గంటెలతో వాయించారు. కొందరైతే బాణ సంచా కాల్చడం గమనార్హం. ఇదిలా ఉంటే,వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో తెలంగాణలో ఐదు జిల్లాలు,ఏపీలో మూడు జిల్లాలు ఉన్నాయి. ఏపీలో కృష్ణా,ప్రకాశం,విశాఖ జిల్లాల్లో.. తెలంగాణలో సంగారెడ్డి,రంగారెడ్డి,హైదరాబాద్,భద్రాద్రి కొత్తగూడెం,మేడ్చల్ జిల్లాలను లాక్ డౌన్ చేయనున్నారు.