నయీం డైరీలో వీఐపీలు వీరే! ఏపీలో కలకలం, ఎవరా ఇద్దరు ఐపీఎస్లు?
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం రాసుకున్న డైరీ ఆధారంగా పోలీసులు తనిఖీలు నిర్వహించే పనిలో పడ్డారు. నార్సింగిలోని నయీం నివాసంలోని రెండో అంతస్తులోని నయీం వ్యక్తిగత గదిలో పోలీసులు ఇప్పటి వరకు సోదాలు నిర్వహించలేదు.
అమ్మాయిలతో జల్సా: నయీంకు ప్రాణాంతక వ్యాధి?
కోర్టు అనుమతితో పోలీసులు బుధవారం నాడు నయీం వ్యక్తిగత గదిని తెరించారు. అంతకుముందు రెవెన్యూ అధికారుల కోసం పోలీసులు కాసేపు వేచి చూశారు. వారు వచ్చిన అనంతరం గది తెరిచి.. సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో తలుపులు బద్దలు కొట్టారు. సోదాల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ అధికారి కూడా వస్తున్నారు.
డైరీలో 16మంది ఐపీఎస్ల జాబితా
నయీం తన అక్రమాలు, దందాల విషయమై డైరీ మెయింటెన్ చేశాడు. అలాగే పెన్ డ్రైవ్, హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాలకు చెందిన 16 మంది ఐపీఎస్ అధికారుల జాబితా లభ్యమైంది.
భయంభయంగా గడిపిన నయీం, పసిగట్టే కుక్కలు, పక్కా 'చిట్టా'తో బెదిరింపు
వారు కోరుకున్న పోస్టింగ్స్ల కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్టు అకౌంటు పుస్తకంలో పేర్కొన్నాడని తెలుస్తోంది. బదులుగా ఆయా రాష్ట్రాల్లో తనకు కావాల్సిన దందాలు సాగించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏపీ పోలీసుల్లో వణుకు.. ఫోన్లు చేసి ఆరా
ఉమ్మడి రాష్ట్రంలో నయీంను అడ్డుపెట్టుకొని వందల కోట్లు సంపాదించిన ఏపీకి చెందిన ఇద్దరు ఐపీఎస్లు తాజా పరిణామాలతో వణికిపోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని పలువురు ఐపీఎస్లు, వారి శిష్యులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఏం జరుగుతోంది? మా పేర్లు ఉన్నాయా? అంటూ ఆరా తీస్తున్నారని సమాచారం.
హైదరాబాద్, మాదాపూర్, రాయదుర్గం, నార్సింగి, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నంలో కోట్ల విలువైన భూములు చేజిక్కించుకున్న సదరు ఇద్దరు ఐపీఎస్లు అప్పట్లో నయీం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని అంటున్నారు.
పోలీసులకు భారీ ముడుపులు
నల్గొండ, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం పని చేస్తున్న, గతంలో పనిచేసిన మొత్తం తొమ్మిది పోలీస్ అధికారులకు నయీం ప్రతి నెలా రూ.85వేల నుంచి రూ.90వేల వరకు మామూళ్లు ఇచ్చేవాడని డైరీలో లెక్క తేలినట్లుగా తెలుస్తోంది.
వీరిలో నలుగురు డీఎస్పీలు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు ఉన్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు నల్గొండ జిల్లాలో పని చేస్తున్న 70శాతం మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి నెలా రూ.10వేల నుంచి రూ.20వేలు మామూళ్లు ఇచ్చినట్లు డైరీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆ ఇద్దరి పేర్ల మీదే రూ.16 కోట్లు
గతంలో నయీంను పెంచి పోషించడంతో పాటు డిపార్ట్మెంట్ నుంచి పుష్కలంగా అండదండలు అందించిన ఇద్దరు అధికారుల పేర్ల మీద రూ.16కోట్ల విలువైన ఆస్తులు నయీం బదలీ చేసినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. వీరిలో ఒకరు ఇపుడు తెలంగాణ లో పని చేస్తుండగా, మరొకరు ఏపీలో సీనియర్ ఐపీఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారని అంటున్నారు. ఆస్తుల లెక్క తీస్తే ఆ అధికారులు బయటపడే అవకాశముందంటున్నారు.
నల్గొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో పనిచేస్తున్న మీడియా, పోలీస్ సిబ్బందికి ఖరీదైన గిఫ్టులు పంపించినట్టు డైరీలో నయీం పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో అరవై మంది పేర్లున్నాయి. వారికి పంపిన గిఫ్టులను తేదీలతో సహా నయీం రాసిపెట్టాడని సమాచారం.
నయీం బాధితులు ఫిర్యాదు చేయవచ్చు: పోలీసులు
నయీం బాధితులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేయవచ్చునని పోలీసులు బుధవారం వాడు వెల్లడించారు. ఎవరికైనా అన్యాయం జరిగితే నేరుగా వచ్చి సంప్రదించవచ్చునని చెప్పారు. కాగా, నయీం కేసులో పోలీసులు ఇద్దరు మహిళలు, పలువురు అనుచరులను అరెస్టు చేశారు.