గాంధీ విగ్రహానికి నల్ల రంగు పూసి .. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పోస్టర్లు వేసి .. నిజామాబాద్ లో కలకలం
నిజామాబాద్ జిల్లా గుండారంలో గాంధీ విగ్రహానికి నల్లరంగు రాసిన ఘటన కలకలం రేపింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. గుండారం గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహానికి నల్ల రంగు పూసి ,పాకిస్ధాన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాసి కాగితాలను గాంధీ విగ్రహానికి కట్టడంతో ఒక్కసారిగా గుండారం గ్రామం ఉలిక్కిపడింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహానికి నల్లరంగు పూసి అవమానించటమే కాకుండా పాకిస్ధాన్ జిందాబాద్ అంటూ పోస్టర్లను గాంధీ విగ్రహానికి కట్టారు. అంతే కాదు షాదుల్ ను విడుదల చేయాలని గాంధీ విగ్రహానికి డిమాండ్ల తో కూడిన దండ వేసిన దుండగులు దేశాన్ని అవమానించే చర్యలకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఈ ఘటనకు పాల్పడిన దుండగులు ఎవరు అన్న దానిపై గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ గుండారం గ్రామస్ధులు పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలి వెళ్లారు . గాంధీ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని.. షాదుల్లాను విడుదల చేయాలంటూ నినాదాలు రాసి, గాంధీ మెడకు కట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు.
గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయని ఫిర్యాదు చేశారు. పాకిస్ధాన్ జిందాబాద్ పేరుతో వెలసిన కాగితాలతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అయితే ఈ ఘటనకు పాల్పడినది ఎవరు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి షాదుల్ను విడుదల చేయాలని, ఇండియా డౌన్ డౌన్ అనే నినాదాలతో రాసిన కరపత్రాలు గాంధీ విగ్రహం వద్ద లభ్యం కావటంతో సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ కార్తికేయ గ్రామానికి వెళ్లి పరిశీలించారు.ఈ ఉద్రిక్తత నేపథ్యంలో గుండారంలో ప్రత్యేక పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. గుండారం గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఘటనతో నిజామాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లైంది.