రోడ్లపై చెత్త వేస్తే ఇక నుంచి జరిమానాలే: జీహెచ్ఎంసీ కమిషనర్
నగరంలో చెత్త వేస్తే ఇక జరిమానాలే! డస్ట్బిన్లను ఏర్పాటు చేయని దుకాణదారులు, వ్యాపార సంస్థలు, తోపుడు బండ్ల వ్యాపారులపై జరిమానాలు విధించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
హైదరాబాద్: నగరంలో డస్ట్బిన్లను ఏర్పాటు చేయని దుకాణదారులు, వ్యాపార సంస్థలు, తోపుడు బండ్ల వ్యాపారులపై జరిమానాలు విధించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ - 2018పై జోనల్, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీర్లతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా దుకాణాదారులు, వాణిజ్య సంస్థలు చెత్తను ప్రత్యేకంగా వేయడానికి డస్ట్ బిన్లను విధిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
జీహెచ్ఎంసీ ఆదేశాలను పట్టించుకోకుండా... డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకోకుండా రోడ్లపై చెత్త వేసేవారికి నగదు జరిమానాలను విధించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ అధికారులు నివాసం ఉండే మున్సిపల్ వార్డులను ప్రత్యేకంగా దత్తత తీసుకొని అక్కడ జరిగే అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని తెలిపారు.
పలుమార్లు హెచ్చరించినప్పటికీ చెత్తను బహిరంగంగా తగులబెట్టే సంఘటనలు పునరావృతమవుతున్నాయని.. చెత్తను తగులబెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. అలాగే నగరంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన షీ టాయిలెట్లలో మహిళా కేర్ టేకర్లను నియమించాలని సూచించారు.
ఇటీవల నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ, తదితర కార్యక్రమాల్లో ఔట్ సోర్సింగ్పై నియమించిన బూత్ స్థాయి అధికారులు సంతృప్తికర సర్వీసులను అందజేయలేదని.. ఈ నేపథ్యంలో బూత్ లేవల్ అధికారులుగా స్థానికంగా ఉండే రిటైర్డ్ అధికారులను నియమించాలని కమిషనర్ ఆదేశించారు.
హైదరాబాద్ నగరాన్ని బహిరంగ మలమూత్ర రహిత నగరంగా ప్రకటించినందున ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ్ -2018లో అగ్రస్థానంలో నిలిపే విధంగా త్రికరణ శుద్ధితో పనిచేయాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు.