జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల ఏర్పాట్లు కట్టుదిట్టం: వాటికి అనుమతి తప్పనిసరి, హెచ్చరికలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధానాలను వివరిస్తూనే.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఓటర్లకు ఈవీఎంలపై అవగాహణ కోసం 397 బస్ స్టేషన్లలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని, 16 ప్రదేశాల్లో ఈవీఎం, వీవీ ప్యాట్లపై 15,158 మందికి అవగాహన కల్పించాయని వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిదులు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ కోరారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్ను అనుసరించి నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలిపారు.నవంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

కాగా, జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 1688 లొకేషన్లలో 3986 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని రొనాల్డ్ రోస్ తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3931 ఉండగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 4, సైబరాబాద్ కమిషనరేట్ లో 51 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు 34,452 పోలింగ్ స్టాఫ్, పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.
ఓటర్ల సందేహాలు నివృత్తి చేయడానికి జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భారత ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నెంబర్, 1800-599-2999 నంబర్లు 24 గంటల పాటు పనిచేస్తాయన్నారు. సీ-విజిల్ యాప్ ద్వారా మోడల్ కోడ్లో ఉల్లంఘన జరిగిన ఫిర్యాదులను 100 నిమిషాలలోపు పరిష్కరించి యాప్లో ఉంచుతామని తెలిపారు. సువిధా సెంటర్ నుంచి సింగిల్ విండో ద్వారా పొలిటికల్ పార్టీలు, అభ్యర్థులు వినియోగించే నాన్ కమర్షియల్, రిమోట్, కంట్రోల్ ఎయిర్ ఫోర్స్, హెలీ ప్యాడ్ లకు అనుమతి తీసుకోవాలన్నారు.
పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, లౌడ్ స్పీకర్లకు అనుమతి తప్పనిసరని రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో 6 టీమ్లతో ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. పొలిటికల్ పార్టీలు చేసే ర్యాలీలు, మీటింగ్లను వీడియోగ్రఫీ చేయడానికి 15 నియోజకవర్గాలలో 15 వీడియో సర్వేటీంలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
హైదరాబాద్ సిటీ పోలిస్ కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ విస్తృత తనిఖీలు చేపట్టిందన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచితంగా అందించే వస్తువులపై, అక్రమ మద్యం రవాణా, నగదు ప్రవాహంపై వేగవంతమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలో 1587 సమస్యాతమాక పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరిగిందని సీపీ తెలిపారు.ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ద్వారా నార్కోటిక్స్పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్సైజ్ కమిషనర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కస్టమ్ నార్కోటిక్ ఈడీ అధికారులతో 24 గంటల పాటు పని చేసే విధంగా.. జిల్లాలో, 18 ప్రదేశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.












Click it and Unblock the Notifications