తెలంగాణ ప్రజల నెత్తిన పాలు పోసిన నరేంద్రమోడీ
తెలంగాణ ప్రజలకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించింది. డోర్నకల్-గద్వాల మధ్య నిర్మాణం చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గం ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలను కలుపుతుంది. నిర్మాణానికి అవసరమైన సర్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నల్గొండ జిల్లాలోని మోతె మండలంలో సర్వే జరుగుతోంది. డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం మీదుగా మోతె మండలంలోని కొత్తగూడెం మీదగా పనులు నడుస్తున్నాయి.
కొత్తగూడెం, తుమ్మలపల్లి గ్రామాలవద్ద రోడ్ పాసింగ్ ను గుర్తించి మార్కింగ్ చేశారు. ఫైనల్ సర్వే కోసం గతేడాది రూ.7.40 కోట్లను మంజూరు చేశారు. డోర్నకల్-గద్వాల మార్గం 296 కిలోమీటర్లు ఉంటుంది. నిర్మాణానికి రూ.5330 కోట్ల వ్యయం కానుంది. ఈ మార్గం పూర్తయితే దక్షిణ తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ మరింత విస్తరిస్తుంది. కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, నల్గొండ, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్కర్నూల్, వనపర్తి వంటి ప్రధాన ప్రాంతాలను ఈ మార్గం కలపనుంది.

నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు పర్యాయాలు రైల్వేలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, సురక్షిత ప్రయాణం కావడంతో ప్రజలంతా రైలు ప్రయాణాలకే మొగ్గుచూపుతున్నారు. అమృత్ భారత్ పేరుతో స్టేషన్లను ఆధునికీకరిస్తుండటంతోపాటు కొత్త రైళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోజురోజుకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువవుతోంది. దీన్ని నివారించేందుకు అదనపు లైన్ల ఏర్పాటుతోపాటు కొత్త రైల్వే లైన్లు నిర్మించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణలో డోర్నకల్-గద్వాల్ మధ్య 296 కిలోమీటర్ల మేర కొత్త లైను అందుబాటులోకి రాబోతోంది.












Click it and Unblock the Notifications