Governor Tamilisai: దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ: తమిళిసై
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో తెలిపారు.
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో తెలిపారు. ఆమె ఉభయ సభలనుద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించారు. తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభించే ముందు.. కాళోజీ కవితను చదివారు. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా ప్రజలది అని అన్నారు.
సీఎం కేసీఆర్
ప్రజల ఆశీర్వాదం, సీఎం సమర్థ పాలనతో రాష్ట్రం ఎనిమిదిన్నరేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కొనియాడారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, ప్రజా సంక్షేమం, గ్రామీణ , పారిశ్రామికంగా ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని గవర్నర్ వివరించారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా 2014 -15లో రూ.1,24,000లుగా ఉన్న తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.3,17,115 కు చేరిందని తెలిపారు.
కాళేశ్వరం
కాళేశ్వరాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకుందాని పేర్కొన్నారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారని.. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సచివాలయం నిర్మాణం జరుగుతోందని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తున్నామని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు.
వ్యవసాయం
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా వ్యవసాయ సాగు భారీగా పెరిగిందన్నారు. ఉచిత, నాణ్యమైన విద్యుత్ ద్వారా రైతులకు ఎంతో లాభం చేకూరిందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను పునరుద్ధరించారని పేర్కొన్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు బంధు ఇస్తున్నారని తెలిపారు. రూ.5లక్షల రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ తమిళి సై పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులు
తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోందన్నారు. రాష్ట్రం వచ్చిన నుంచి 2022 వరకు 1,41,735 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని వివరించారు.
ఐటీ అభివృద్ధి
తెలంగాణలో ఐటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు భారీగా వస్తున్నాయని చెప్పారు. ఎనిమిదిన్నరేళ్లలో పారిశ్రామిక, ఐటీ రంగాల్లో 3.31లక్షళ కోట్ల పెట్టుబడలు ఆకర్షించినట్లు గుర్తు చేశారు. ఐటీ ఉద్యోగ నియామకాల్లో 140శాతం వృద్ధి సాధించిమన్నారు.