తెలంగాణలో కరోనా తీవ్రత: హైదరాబాద్లో అయిదు చోట్ల..జూబ్లీహిల్స్ అపోలో సహా: కేంద్రం కీలక నిర్ణయం..!
హైదరాబాద్: అడ్డు, అదుపు లేకుండా చెలరేగిపోతోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో నివారణ చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా- ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కూడా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కలాశాలలకు మాత్రమే పరిమితమైన కరోనా వైరస్ పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అప్పగించడం ఇదే తొలిసారి.
తొమ్మిది రాష్ట్రాల్లో 40 ప్రైవేటు ఆసుపత్రుల్లో..
దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 40 ప్రైవేటు ఆసుపత్రుల ల్యాబొరేటరీల్లో కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ ల్యాబొరేటరీల్లో చోటు చేసుకునే కరోనా వైరస్ పరీక్షలన్నింటినీ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పర్యవేక్షిస్తుంది.
తెలంగాణలో అయిదు చోట్ల..
తెలంగాణలో మొత్తం అయిదు ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించిన ల్యాబొరేటరీలను కరోనా వైరస్ పరీక్షల కోసం ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రి, హిమాయత్ నగర్లోని విజయా డయాగ్నస్టిక్ సెంటర్, హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామికవాడలో గల విమ్టా ల్యాబొరేటరీస్, బోయిన్పల్లిలోని అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్ లిమిటెడ్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీ, పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్లల్లో ఇక నుంచి కరోనా పరీక్షలను నిర్వహిస్తారు.
అత్యధికంగా మహారాష్ట్రలో..
అనుమానితుల నుంచి సేకరించిన రక్త పరీక్షలను నిర్వహించిన తరువాత దీనికి సంబంధించిన నివేదికను ఐసీఎంఆర్ ప్రతినిధులకు అందజేయాల్సి ఉంటుంది. ఐసీఎంఆర్ ఆమోదించిన తరువాతే.. ఫలితాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ తీవ్రత అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో మొత్తం తొమ్మిది ప్రైవేటు ఆసుపత్రుల ల్యాబొరేటరీల్లో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణకు అనుమతి లభించింది. తమిళనాడు, గుజరాత్లల్లో నాలుగు చొప్పున ఒడిశా, పశ్చిమ బెంగాల్లల్లో ఒక్కొక్కటి చొప్పున ప్రైవేటు ఆసుపత్రుల ల్యాబొరేటరీలను ఎంపిక చేశారు. ఢిల్లీలో ఆరు, హర్యానాలో మూడు, కర్ణాటకలో రెండు ఏర్పాటు అయ్యాయి.