వారి ఖాతాల్లో ప్రభుత్వం భరోసా నిధుల జమ..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉపాధి కూలీల ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను జమ చేసింది. జనవరి 26న ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఎన్నికలు జరగని రెండు జిల్లాల లబ్దిదారుల ఖాతాల్లో ఈ రోజు ప్రభుత్వ నిధులు జమ అయ్యాయి. కోడ్ పూర్తయిన తరువాత ఇతర జిల్లాల్లోని లబ్ది దారులకు నిధులు జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ తాజా నిర్ణయం
మహాశివరాత్రి పర్వదినాన తెలంగాణలో ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడు దల చేసింది.ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిధులు జమ చేసారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగా ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేసింది. మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా చెల్లింపు తాత్కాలికంగా నిలిచిపోయింది.

రెండు జిల్లాల్లో అమలు
ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి సీతక్క అభ్యర్ధన మేరకు ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో నిధుల విడుదలకు నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్నికల లేని జిల్లాలైన ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారు లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించింది. 66,640 మంది కూలీల ఖాతాల్లో రూ.39.74 కోట్లు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు.
నేరుగా ఖాతాల్లో జమ
కాగా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉ పాధి కూలీలకు రూ.50.65 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. మార్చి 4న ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపు తో కోడ్ ముగియనుంది. ఆ తరువాత లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక సీజన్కు 6000 రూపాయలు చొప్పున కూలీలకు భరోసా కల్పిస్తోంది. డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లోకి నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం జమ చేస్తోంది. దీంతో.. మార్చి తొలి వారంలో ఇతర జిల్లాల్లోనూ ఈ నిధుల జమ ప్రక్రియ కొనసాగనుంది.












Click it and Unblock the Notifications