విషాదం : మరికొద్ది గంటల్లో పెళ్లి... ఇంతలోనే వరుడి మృతి... బలితీసుకున్న కరోనా..?
మరికొద్ది గంటల్లో పెళ్లి... కుటుంబమంతా ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు... పెళ్లి కొడుకును ముస్తాబు చేశారు... ఇక వధువు ఇంటికి వెళ్లి పెళ్లి జరగడమే తరువాయి... కానీ ఇంతలోనే పరిస్థితులు తలకిందులయ్యాయి.. పెళ్లి కొడుకు చలితో వణుకుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కోవిడ్ వల్లే పవన్ మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగంరావు పవన్ కుమార్(34)కు ఇటీవల భువనగరి జిల్లా ఆత్మకూరుకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. శనివారం(మే 22) ఈ జంట పెళ్లి జరగాల్సి ఉంది. శుక్రవారం నాటికే దాదాపు పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. శుక్రవారం రాత్రి పవన్ కుమార్ను పెళ్లి కొడుకును చేశారు. తెల్లవారితే వధువు ఇంటి దగ్గర పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే అంతా తలకిందులైంది.
శుక్రవారం రాత్రి పవన్ కుమార్ విపరీతమైన చలితో వణికిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు నిర్దారించారు. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. అటు వరుడి కుటుంబం,ఇటు వధువు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కొద్దిరోజుల క్రితం పవన్ కుమార్ కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల క్రితమే కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు సమాచారం. కోవిడ్ కారణంగానే పవన్ కుమార్ మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
Recommended Video
రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విజయనగరంలోని సాలూరులోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మనోహార్ అనే వరుడికి ఈ నెల 23న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో కరోనా బారినపడ్డ అతను ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. మనోహర్ కోలుకుంటాడన్న నమ్మకంతో కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. కానీ పెళ్లికి 3 రోజుల ముందు మనోహర్ పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే మృతి చెందాడు. పెళ్లి కావాల్సినోడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనా వేళ దేశవ్యాప్తంగా ఇలాంటి విషాద ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.