రాష్ట్రపతి పాలనపై షర్మిలకు కీలక హామీ ఇచ్చిన గవర్నర్ తమిళిసై..!!
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇవ్వాళ హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇవ్వాళ హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, రాష్ట్రపతి పాలనను విధించాలని కోరారు. దీనిపై వినతిపత్రాన్ని అందజేశారు.

అదుపు తప్పిన శాంతిభద్రతలు
గవర్నర్ ను కలిసిన అనంతరం వైఎస్ షర్మిల.. విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, మహిళలకు కనీస గౌరవం దక్కట్లేదని అన్నారు. ప్రతి పక్ష పార్టీలకు గొంతెత్తి మాట్లాడే స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ప్రతి పక్షాల గొంతు నొక్కి సమాజాన్ని, ప్రజా స్వామ్యాన్ని అవమానించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తోన్నారని, ఆయనకు పాలించే నైతిక హక్కు లేదని అన్నారు.

ప్రజాస్వామ్యం లేదు..
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థమే లేదని, దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం అమల్లో ఉంటే తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం ఉందని వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజలకు ఈ రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు కూడా విలువ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అవమానిస్తోన్నారని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోన్నారంటూ ధ్వజమెత్తారు. ప్రతి పక్షాలు అన్న పదం వింటేనే కేసీఆర్, బీఆర్ఎస్ ఉలిక్కిపడుతున్నాయని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలపై దాడులు..
ప్రజల తరఫున కొట్లాడే ప్రతిపక్షాలపై కేసీఆర్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. పట్టపగలు వీధి కుక్కలు దాడి చేసి చిన్న పిల్లలను చంపేస్తే ఒక్కరూ నోరు మెదపట్లేదని అన్నారు. ప్రతిపక్షాలు ప్రజల పక్షంగా ఉంటాయనే సోయి కూడా లేదని ఆరోపించారు. నియోజకవర్గస్థాయిలో కూడా ప్రతిపక్షాలను అధికార పార్టీ బయటకి రానివ్వట్లేదని విమర్శించారు. పోలీసు, అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని దాడులు చేస్తోన్నారని అన్నారు.

బీఆర్ఎస్ లో..
బీఆర్ఎస్ లో నాయకులు, కార్యకర్తలు లేరని.. ఉన్నదల్లా గూండాలు మాత్రమేనంటూ వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు.తాను రాష్ట్రంలో 3,800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని, బీఆర్ఎస్ నాయకుల అవినీతిని ప్రశ్నిస్తే నోటికొచ్చినట్లు తిడుతూ, అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బీఆర్ఎస్ కు మాత్రమే పరిమితమైందని మండిపడ్డారు.
రాష్ట్రపతిని కూడా..
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తాము కోరుతున్నామని, తన విజ్ఞప్తి పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రపతి పాలన విధించేలా డిమాండ్ చేయాలంటూ ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా తాను విజ్ఞప్తి చేస్తోన్నానని షర్మిల అన్నారు. ఇదే డిమాండ్ తో తాము రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్లబోతున్నామని ఆమె వివరించారు. డ్రగ్స్ కుంభకోణలో పెద్దపెద్ద వాళ్లున్నారని పేర్లు వస్తున్నా ఎవ్వరినీ అరెస్ట్ చేయట్లేదని అన్నారు.












Click it and Unblock the Notifications