'ఐటీ దాడులపై రేవంత్రెడ్డి అలా చెప్తున్నారు కానీ, అడ్డంగా దొరికారు, త్వరలో మరింత బయటకు'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పైన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు శనివారం నిప్పులు చెరిగారు. రేవంత్ ప్రజాప్రతినిధిలా కాకుండా భూకబ్జాదారుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఆదాయపన్ను శాఖ దాడుల్లో ఏమీ దొరకలేదని చెబుతూ ఆయన ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఐటీ దాడుల ద్వారా ఏం కాలేదని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. కానీ రేవంత్ రెడ్డి బినామీ వ్యాపారాలు చేస్తున్నారని, ఆధారాలతో సహా దొరికిపోయారని చెప్పారు.
ఐటీ దాడుల్లో కొంతే బయటపడింది, త్వరలో అంతా వెలుగుచూస్తుంది
రేవంత్ రెడ్డి అక్రమార్జన పైన తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. రేవంత్ తీరు ఓ రౌడీలా ఉందని, ఆయన ప్రజాప్రతినిధిలా వ్యవహరించడం లేదన్నారు. ఆదాయపన్ను శాఖ నివేదిక మాత్రం రేవంత్ అక్రమంగా సంపాదించిన దాంట్లో కొంత మాత్రమే బయటపడిందని, త్వరలో అంతా బయటపడుతుందని చెప్పారు. రేవంత్ రాజకీయ నాయకుడిలా కాకుండా భూమాఫియాదారుడిగా వ్యవహరిస్తున్నారన్నారు.
రాజధానిలో బతుకమ్మ ఆడలేని దుస్థితి
జీవీఎల్ నర్సింహా రావు తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ పైన కూడా విమర్శలు చేశారు. హైదరాబాదులోని పాతబస్తీలో బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతి కావాలని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. పాతబస్తీ ఏమైనా పాకిస్తాన్లో ఉందా లేక ఓవైసీకి రాసిచ్చారా అని ప్రశ్నించారు. పాతబస్తీలో తెలంగాణ పాలన సాగడం లేదా అన్నారు. రాజధానిలోనే మహిళలు బతుకమ్మ ఆడలేని దుస్థితి ఉందన్నారు.
కేసీఆర్, కవిత క్షమాపణలు చెప్పాలి
దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఆయనతో సహా ఇప్పటి వరకు స్పందించని ఎంపీ కవిత ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మృతదేహాన్ని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలోకి అనుమతించలేదని, తద్వారా ఆయనను కాంగ్రెస్ అవమానించిందని చెప్పారు. పీవీ పట్ల కుట్రతో వ్యవహరించిన తీరుపై సోనియా, రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాహుల్ ఏ రాష్ట్రంలో పర్యటించినా అక్కడ బీజేపీకి మేలు అన్నారు. తెలంగాణలోనూ అదే పునరావృతం అవుతుందన్నారు.
బతుకమ్మ ఆడవద్దని మహిళలకు
కాగా, పాతబస్తీలో సద్దుల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ ఆడుతున్న మహిళలను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలు కూడా పోలీసులను ఘాటుగానే ప్రశ్నించారు. బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతి తీసుకోవాలా, ఇక్కడ ఆడుకోవద్దా అని గట్టిగా ప్రశ్నించారు. దీంతో పోలీసులు నీళ్లు నమలాల్సిన పరిస్థితి వచ్చింది.