ముంబైలో వరంగల్ చేనేత కార్మికుడి దారుణ హత్య, భార్యపైనే అనుమానం
రేగొండ మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు ముంబై పట్టణంలో దారుణ హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
వరంగల్: రేగొండ మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు ముంబై పట్టణంలో దారుణ హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మంతెన రమేష్.. బ్రతుకుదెరువు కోసం గత 15 సంవత్సరాల క్రితం ముంబైకి వెళ్లి చేనేత దుస్తులు తయారుచేసే కంపెనీలో పని చేస్తూ ముంబై పట్టణానికి చెందిన రమను వివాహం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు.
ఇలా కొంతకాలం గడిచింది. ఏమైందో శనివారం రాత్రి రమేష్పై కొంత మంది వ్యక్తులు కత్తులతో దాడిచేసి గొంతుపై పొడిచి దారుణంగా చంపేశారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతునికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
మృతుని సోదరుడు సదానందదంకు వెంటనే సమాచారాన్ని అందించడంతో హుటాహుటిన ముంబైకి వెళ్లి.. రమేష్ మృతదేహాన్ని చూసిన సదానందం తన తమ్మున్ని రమేష్ భార్య హత్యచేయించి ఉంటుందని.. తమ్ముడిని మృతికి ఆమె కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన అనంతరం తన తమ్ముడి మృతదేహాన్ని ముంబై పోలీసుల సహాయంతో రేగొండకు తీసుకువచ్చి అంత్యక్రియలు చేశామని సోదరుడు సదానందం తెలిపారు. మృతునికి కూతురు ఉన్నట్లు వారు తెలిపారు.
2008 కేసులో తీర్పు: హత్య కేసులో ఆరుగురికి జీవిత ఖైదు
వరంగల్: పాత కక్షలను మనసులో ఉంచుకొని ఒకరిని అతి కిరాతకంగా కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపి, మరో ఇద్దరిని తీవ్రంగా గాయపర్చిన ఒకే గ్రామానికి చెందిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 4 వేల చొప్పున జరిమానా విధిస్తూ నాలుగో అదనపు జిల్లా కోర్టు ఇంఛార్జీ న్యాయమూర్తి డి చిరంజీవులు (మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి) మంగళవారం తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కేసు వివరాలిలా ఉన్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రామకృష్ణాపురం (వి) గ్రామానికి చెందిన అచెకచ మల్లయ్య, ఆయన తమ్ముళ్లు సాగర్, రమేష్ 2008 ఆగస్టు 2వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో తమ ఎరువుల దుకాణాన్ని తెరిచి కూర్చున్నారు. మిర్చి విత్తనాల కోసం గ్రామానికి చెందిన సుధాకర్, కొమురయ్య రాగా అదే సమయంలో దుకాణం ముందు నుంచి వెళ్తున్న ఎడ్ల రవి షాపు యజమానులనుద్దేశించి ఘాటుగా మ్లాడారు.
షాపు ముందు రహదారిపై నిలిపిన వాహనాలను తీయాలని గద్దించాడు. దుకాణంలో ఉన్న ముగ్గురిలో ఒకరిపైనా చంపుతానని ఆవేశంగా మాట్లాడారు. సరిగ్గా అదే సమయంలో ఎడ్ల కుమార్, ఎడ్ల బాలకొమురు, ఎడ్ల రాజౌలు, ఎడ్ల చేరాలు అలియాస్ దేవన్న, నాంపెల్లి సాంబయ్య కత్తులు, గొడ్డళ్లతో వచ్చారు. వారిని గమనించిన షాపు యజమానులు ముగ్గురూ తప్పించుకునే ప్రయత్నంలో ఉండగానే వారంతా మల్లయ్యతోపాటు అతని తమ్ముళ్లు సాగర్, రమేష్లపై దాడికి పాల్పడ్డారు.
మారణాయుధాలతో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన మల్లయ్య, సాగర్లను చికిత్స నిమిత్తం పరకాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో శాంతినగర్ వద్ద సాగర్ మృతి చెందాడు. అదే సమయంలో 108 వాహనం రావడంతో మల్లయ్యను అందులో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో స్వల్పంగా గాయపడిన మృతుని తమ్ముడు రమేష్ చ్యిల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులు కుమార్, బాలకొమురు, రాజౌలు, చేరాలు, రవి, సాంబయ్యలపై హత్యానేరం కింద కేసు పెట్టి కోర్టులో హాజరుపర్చగా విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఆరుగురికి జీవిత ఖైదు విధించారు.
నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న యుతకు మాయ మాటలు చెప్పి, నకిలీ ధ్రువీకరణ పత్రాలను అంటగడుతున్న ఓ వ్యక్తిని మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జిల్లా ఎస్పీ అనంతశర్మ పట్టుకున్నారు. పట్టణంలోని కేడీసీసీ బ్యాంకు సమీపంలో భవాని ఎడ్యూకేషనల్ అకాడమీ పేరిట నిర్వహిస్తున్న కేంద్రాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జార్ఖండ్ నుంచి మెట్పల్లికి కొరియర్ ద్వారా రవాణా అవుతున్న పలు నకిలీ సర్టిఫికెట్లను గుర్తించారు. మూడు నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన కె. నరేష్ కొంతకాలంగా మెట్పల్లిలో భవాని ఎడ్యూకేషనల్ అకాడమీ పేరిట కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.