ప్రేమించమంటూ విద్యార్థినికి వేధింపులు: టీచర్కి ఏడాది కఠిన కారాగార శిక్ష
హైదరాబాద్/నల్గొండ: ప్రేమించాలంటూ విద్యార్థినిని వేధించిన తెలుగు ఉపాధ్యాయుడికి కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కమ్మగూడ నివాసి సబ్బినేని మధు అలియాస్ మధు సురేష్ రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు.
ఓ విద్యార్థినిని(15) ప్రేమిస్తున్నానంటూ 2013లో మాయ మాటలతో నమ్మించి అపహరించడానికి విఫలయత్నం చేశాడు. సమాచారం అందుకున్న మీర్పేట పోలీసులు మధుపై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
రెండు మాసాల తర్వాత జైలు నుంచి బయటకి వచ్చినా అతడి బుద్ధి మారలేదు. విద్యార్థిని వెంటపడ్తూ ప్రేమించాలని వేధింపులకు గురిచేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి మళ్లీ రిమాండుకు తరలించారు. అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన సైబరాబాద్ రెండో మేజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు.
రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. 371 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు.