నవ్వులు విరిశాయి: అయుత చండీయాగంలో బావబావమరదుల సందడి
మెదక్: లోకకళ్యాణం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చేపట్టిన అయుత చండీయాగంలో కెసిఆర్ తనయడు, ఐటి మంత్రి కెటి రామారావు, మేనల్లుడు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సందడి చేశారు. యాగానికి వచ్చిన ప్రముఖులు, అతిథులకు వారు స్వాగతం పలికారు.
సుమారు రెండు గంటలపాటు ఏర్పాట్లపై మంతనాల్లో నిమగ్నమయ్యారు. కేటీఆర్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా హరీశ్రావు సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. ఇద్దరు మొదటి వరుసలో పక్కపక్కనే కూర్చుని నవ్వులు చిందించారు. యాగానికి విచ్చేసిన వీవీఐపీలు, వీఐపీలకు కావాల్సిన ఏర్పాట్లు, ఇతర వసతులను వీరిద్దరూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
వీవీఐపీ, వీఐపీ మార్గంలో ఏర్పాటు చేసిన కుటీరం వద్ద నిలబడి పూర్ణకుంభంతో వేద మంత్రోచ్ఛారణల మధ్య అతిథులందరికీ స్వాగతం పలికారు. గవర్నర్ నరసింహన్ దంపతులతో కేటీఆర్, హరీశ్ చాలాసేపు మాట్లాడారు.
రాష్ట్ర మంత్రులకు సైతం వీరిద్దరూ స్వయంగా ఆహ్వానం పలికారు. ఎంపీలు కొత్త ప్రభాకర్రెడ్డి, బాల్క సుమన్ తదితరులు కేటీఆర్, హరీశ్రావు వెంట ఉన్నారు. మొత్తానికి బావా బావమరుదులు యాగస్థలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.