చంద్రబాబుతో దోస్తీపై ఉత్తమ్, జానా సమాధానం చెప్పాలి: హరీశ్, బంద్పై జూపల్లి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనలో కలిసిరాని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జతకట్టడం అవివేకమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అడుగడుగునా తెలంగాణ నీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న ఏపి సిఎం చంద్రబాబుతో దోస్తీ విషయంలో రైతులకు ఉత్తమ్కుమార్, జానారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే 52 శాతం రుణమాఫీ జరిగిందన్నారు. రైతులు కష్టాల్లో ఉన్న మాట వాస్తవమే, గత పాలకుల పుణ్యమే ఈ కష్టాలకు కారణమని విమర్శించారు. రాష్ట్రంలో 83 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
రూ.1024 కోట్లతో రాష్ర్టావ్యాప్తంగా 10 జిల్లాల్లో గోదాములు నిర్మాణం చేపడతామని అన్నారు. ఎక్కాడా లేని విధంగా దళారుల భారి నుంచి కాపాడటానికి పత్తి రైతులకు కార్డుల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నాం. ప్రస్తుత ఏడాది వ్యవసాయరంగానికి కేంద్రం రూ.5వేల కోట్లు తగ్గించిందని.. రాష్ర్టానికి రుణపరిమితి పెంచాలని కోరినా కేంద్రం స్పందించలేదని అన్నారు.
ఉనికిని కాపాడుకోవడానికే ప్రతిపక్షాల బంద్: జూపల్లి
గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, రైతుల కోసం ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు.
ప్రణాళికబద్ధంగా మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఏ విషయంలో కూడా ప్రతిపక్షాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఉనికిని కాపాడుకోవడానికే విపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయని విమర్శించారు.
విపక్షాలకు రాజకీయాలు, పదవులు తప్ప ప్రజల బాధలు తెలియవని ఎద్దేవా చేశారు. విపక్షాల బంద్కు ప్రజలు, రైతులెవరూ స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా విపక్షాలు బుద్ది తెచ్చుకొని... ప్రభుత్వానికి సహకరించాలని జూపల్లి హితవు పలికారు.