కోదండ సంచలనం: ఎవరి కోసం చేస్తున్నావని ఊగిపోయిన హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పైన మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జేఏసీ నేతగా పొందిన గౌరవాన్ని ఆయన కోల్పోతున్నారన్నారు. ప్రతిపక్షం చేతిలో ఆయన పావుగా మారారని తీవ్ర ఆరోపణలు చేసారు.
కోదండరాం కాంగ్రెస్ పార్టీ అజెండాలో నడుస్తున్నారన్నారు. అసలు కోదండరాం ఎవరి కోసం దీక్షలు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. ఓ వైపు ప్రాజెక్టులకు అడ్డు తగులుతూ, మరోవైపు రైతుల సమస్యల కోసం దీక్ష ఎలా చేస్తారో చెప్పాలన్నారు.
కోదండరామ్ దీక్షలు చేయడం బాధాకరమన్నారు. మల్లన్నసాగర్, పాలమూరు ప్రాజెక్ట్ల విషయంలో రైతులకు నష్టం కలిగించేలా కోదండరాం వ్యవహరించారన్నారు. ప్రతిపక్షాలు దీక్షలు చేయడం సహజం కానీ కోదండరాం లాంటివారు దీక్షలు చేయడం సరికాదన్నారు.
ఒకవేళ కోదండరాం దీక్ష రైతుల కోసమే అయితే మల్లన్న సాగర్ వద్ద ఎందుకు చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టారని ఆరోపించారు.
కాగా, రైతుకు అన్ని విధాలుగా అవమానం జరుగుతోందని కోదండరాం అంతకుముందు ఆరోపించిన విషయం తెలిసిందే. 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారని, ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే మూలస్తంభమన్నారు. వ్యవసాయం బాగుంటేనే వ్యాపారాలు నడుస్తాయన్నారు.
సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలని, విత్తన చట్టం, రైతు ఆదాయ భద్రత చట్టం తేవాలని డిమాండ్ చేశారు. రైతుకు సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విచ్చల విడి భూసేకరణ ఆపాలని, రైతుకు భూమికి భూమి ఇవ్వాలని స్పష్టం చేశారు. భూములు ఇస్తేనే కంపెనీలు వస్తాయనుకోవడం అవివేకమని, వ్యవసాయ నిధిని ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరా పార్క్ వద్ద కోదండ దీక్ష చేసిన విషయం తెలిసిందే.